కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టే
ABN , First Publish Date - 2022-08-20T10:24:33+05:30 IST
కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు.
రుణాల వడ్డీ మీ కుటుంబం కడుతోందా?
మంత్రి హరీశ్కు రచనారెడ్డి సూటి ప్రశ్న
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి అన్నారు. అటవీ, పర్యావరణ అనుమతుల్లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడమేంటని మండిపడ్డారు. ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు పెద్దఎత్తున జరిగాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నీళ్లు ఎక్కడిచ్చారో శాస్త్రీయంగా నిరూపించాలని మంత్రి హరీశ్ రావును డిమాండ్ చేశారు. కేంద్ర సంస్థల నుంచి పెద్దఎత్తున రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం.. 12 బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న వందల కోట్ల రుణానికి వాణిజ్య వడ్డీ రేటు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుందన్నారు. ఈ వడ్డీని మీ కుటుంబం కడుతోందా? అని హరీశ్ రావును నిలదీశారు. అనూహ్యంగా వచ్చిన వరదల వల్లే పంప్హౌజ్లో మోటార్లు మునిగిపోయాయని మంత్రి చెప్పడం విడ్డూరమన్నారు.