ఏపీలో నియంత్రత్వాన్ని తలదన్నే పాలన: కాల్వ
ABN , First Publish Date - 2020-10-01T21:59:43+05:30 IST
రాష్ట్రంలో నియంత్రత్వాన్ని తలదన్నే పాలనను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తున్నామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
అమరావతి: రాష్ట్రంలో నియంత్రత్వాన్ని తలదన్నే పాలనను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తున్నామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ‘ఏపీలో 70 శాతానికి పైగా ఉన్న బడుగు, బలహీనవర్గాల ప్రాధాన్యత, సంక్షేమం ఈ ప్రభుత్వంలో దిగదుడుపుగా మారింది. రూ.3,890 కోట్ల సబ్సిడీ రుణాలు వెనుకబడిన తరగతులవారికి ఇస్తామని చెప్పిన జగన్.. ఎంతమంది బీసీలను రుణపరంగా ఆదుకున్నారు? నేతన్న నేస్తం, అమ్మఒడి, వాహనమిత్ర, ఇతరేతర పథకాల కింద ఇచ్చే సొమ్ముని కూడా బీసీ కార్పొరేషన్ పద్దులో చూపుతున్నారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి.. విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించారు. బీసీ నేతలంతా వారి చుట్టూ తిరిగితే తప్ప.. జగన్మోహన్ రెడ్డి దర్శనం లభించే పరిస్థితి లేదు’ అని ఆరోపించారు.
‘ఏడాదిన్నర తర్వాత బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించాలని జగన్కు ఎందుకు అనిపించింది? టీడీపీ పార్లమెంట్ కమిటీల్లో చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాకే జగన్కు బీసీలు గుర్తొచ్చారు. జీతభత్యాలు లేని ఛైర్మన్ పదవులను కార్పొరేషన్ల పేరుతో జగన్ బీసీలకు అప్పగించారు. రాజకీయ ప్రాధాన్యం లేని పదవులను బీసీలకు ఇవ్వడం ద్వారా వారిని మరింత అణగదొక్కాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న బీసీ కార్పొరేషన్లు ఒక టేబుల్, నాలుగు కుర్చీలకే పరిమితం. జగన్ ప్రభుత్వంలో దళిత, బీసీ మంత్రులు సూపర్ పవర్ కింద పనిచేస్తూ.. ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. బీసీలను ఉద్ధరిస్తామనే మోసపూరిత ప్రకటనలు, కాకిలెక్కలు, తప్పుడు విధానాలను జగన్ అండ్ కో మానుకుంటే మంచిది’ అని మాజీ మంత్రి కాల్వ హితవు పలికారు.