అనంత రైతుకు సీఎం జగన్ ద్రోహం
ABN , First Publish Date - 2020-12-04T06:31:45+05:30 IST
అనంత రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
30 మండలాలకు ఇన్సూరెన్స్, నష్టపరిహారం ఎత్తివేత
వాస్తవ పరిస్థితులు చూపటంలో విఫలం
జిల్లా ప్రజాప్రతినిధుల వల్లే ఈ దుస్థితి
అసెంబ్లీలోనైనా సీఎం దృష్టికి తీసుకెళ్లాలి
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
అనంతపురం వైద్యం, డిసెంబరు3: అనంత రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురంలోని స్వగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో వేరుశనగ పంటను రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట ఆఖరి దశలో వర్షాలు అధికంగా కురవటంతో దిగుబడి రాలేదన్నారు. మరోవైపు చేతికొచ్చిన పంట కుళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట కోత ప్రయోగాల్లో వాస్తవ పరిస్థితులు చూపకపోవటంతో జిల్లాలోని 30 మండలాలకు ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం అందకుండా పోతోందన్నారు. హెక్టార్కు 450 కేజీలు దిగుబడి ఏ మండలంలో వచ్చిందని పంట కోత ప్రయోగాలలో చూపించారో ఆ మండలాలన్నింటికి అన్యాయం జరుగుతుందన్నారు. జాతీయ రాష్ట్ర విపత్తుల నుంచి నిధులు రావాలంటే అందాల్సిన దిగుబడికన్నా 33 శాతం తక్కువ వచ్చినపుడే ఆ రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. ఇది తెలిసినా జిల్లా ప్రజాప్రతినిధులు బా ధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల ఈ 30 మండలాల రైతులకు అన్యాయం జరిగిపోతుందన్నారు. ఎక్కడ పంట ప్రయోగాలు చేస్తున్నారు అ క్కడ పరిస్థితి, ఆ మండలాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అని కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించకపోవటం బాధాకరమన్నారు. భారీ వర్షాలకు జిల్లాలో అనేక మంది రైతుల పంటలు నష్టపోయారని, కేవలం జిల్లాలో వర్షాలకు రూ16 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేయటం న్యాయమా అని ప్రశ్నించారు. రైతులంటే వైసీపీ ప్రజాప్రతినిధులకు లెక్క లేదా అని ప్రశ్నించారు. ఈ అన్యాయంపై కనీసం అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా జిల్లా నేతలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడిని రైతులు నష్టపోయారన్నారు. అలాంటి పరిస్థితిలో 30 మండలాల రైతులకు ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం రాకపోవటం ఎంత దుర్మార్గమన్నారు. ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకపోవటం సిగ్గుచేటన్నారు. ఖరీ్ఫలో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని కాలవ హెచ్చరించారు.