గ్రీన్సిటీగా కాగజ్నగర్
ABN , First Publish Date - 2020-07-04T10:27:55+05:30 IST
కాగజ్నగర్ మున్సిపాలిటీ ఇక గ్రీన్సిటీగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో జనాభా ప్రతిపాదికన మొక్కలు నాటేందుకు ఆదేశాలు జారీ చేసింది
3.74లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయం
కార్యాచరణ సిద్ధం చేసిన అధికారులు
కాగజ్నగర్, జూలై 3: కాగజ్నగర్ మున్సిపాలిటీ ఇక గ్రీన్సిటీగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో జనాభా ప్రతిపాదికన మొక్కలు నాటేందుకు ఆదేశాలు జారీ చేసింది. కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 3.74లక్షలు మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మున్సిపల్ చైర్మ న్ సద్దాంహుస్సేన్తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పక్కాగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వార్డు కౌన్సిలర్కు 300 నుంచి 500 మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. వార్డుల్లో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇంటింటా, వార్డుల వారీగా మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీకి సమకూరే ఆదాయం నుంచి పది శాతం మొక్కల సంరక్షణకు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
పక్కాగా ప్రణాళికలు..
పట్టణ పరిధిలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు పక్కగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 30 వార్డుల పరిధిలోని ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 1.74లక్షలు మొక్కలు 30 వార్డుల్లో నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 25 మంది కూలీలతో నిత్యం పనులు చేయిస్తున్నారు. ఆయా వార్డుల పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఈ మేరకు రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు, ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మార్కెట్ కమిటీ చెక్ పోస్టు వరకు, లారీ చౌరస్తా నుంచి సర్సిల్క్ ఏరియా, అంబేద్కర్ చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియా ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. నాటిన మొక్కలకు కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచనల మేరకు హరితహారంలో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వార్డుల్లో ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నాటేందుకు మందారం, కానుగా, వేప, ఉసిరి, దానిమ్మ, గులాబీ మొక్కలను ఉచితంగా అందజేస్తున్నారు.
మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు.. శ్రీనివాస్, కమిషనర్, కాగజ్నగర్
మున్సిపాలిటీ పరిధిలో 3.74లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించేందుకు సహకరించాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వార్డుల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నాం.
ఉచితంగా పంపిణీ చేస్తున్నాం..ప్రణీల్కుమార్, మున్సిపల్ ఇంజనీర్
ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు నర్సరీ నుంచి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వార్డుల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటి ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం.