హైదరాబాద్లో కడప జిల్లా ఫార్మసిస్ట్ అరెస్ట్.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2021-05-08T18:10:35+05:30 IST
కడప జిల్లాకు చెందిన పసుల జోసఫ్ రెడ్డి
హైదరాబాద్/హైదర్నగర్ : అక్రమంగా రెమ్డెసివిర్ వయల్ను విక్రయిస్తున్న ఫార్మసిస్ట్ను కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. టెంపుల్ బస్టాప్ సమీపంలో ఆర్డీవెక్స్ ఫార్మసీలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మెడికల్ షాపునకు వెళ్లి పరిశీలించగా, కడప జిల్లాకు చెందిన పసుల జోసఫ్ రెడ్డి ఒక్కో వయల్ను రూ.25 వేలకు విక్రయిస్తున్నాడు. విచారణ జరపగా తాను రెండు రోజుల క్రితం పేషెంట్ వెంకటరెడ్డి పేరిట హెటిరో కంపెనీ నుంచి 6 వయల్స్ను (ఒక్కో వయల్ రూ.3,400) కొన్నట్టు నిందితుడు తెలిపాడు. కానీ, వాటిలో 5 ఇంజక్షన్లను వెంకటరెడ్డికి రూ.లక్షకు విక్రయించానని, ఇంకొకటి తన దగ్గరే పెట్టుకున్నట్లు వెల్లడించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి వయల్తో పాటు ఐఫోన్ను జప్తు చేశారు.