శానిటైజర్ల విక్రయాలపై పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2020-08-06T10:04:13+05:30 IST
శానిటైజర్ల విక్రయాలపై పోలీసుల దాడులు
కడప (క్రైం), ఆగస్టు 5: జిల్లావ్యాప్తంగా శానిటైజర్ల విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మెడికల్ దుకాణాలు, కిరాణా దుకాణాలు, శానిటైజర్లు విక్రయించే దుకాణాల్లో తనిఖీలు చేశారు. కంపెనీల్లో తయారైన శానిటైజర్లు మాత్రమే విక్రయించాలని ఎవరైనా ఇష్టానుసారంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. జిల్లాలోని సబ్ డివిజన్ల అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది శానిటైజర్లను తనిఖీ చేయడంతో పాటు దుకాణ యజమానులకు కౌన్సిలింగ్ చేశారు. శానిటైజర్లు విక్రయించేటప్పుడు బిల్లులు ఇవ్వాలని, అలా లేకుండా ఇస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించే వారికి శానిటైజర్లు విక్రయించకూడదని సూచించారు.
కడప డీఎస్పీ ఆధ్వర్యంలో..
కడప సబ్ డివిజన్ పరిధిలోని డిస్టిలరీ తయారీ కేంద్రంతో పాటు శానిటైజర్ల తయారీ కేంద్రాలను డీఎస్పీ సూర్యనారాయణ తనిఖీ చేశారు. కంపెనీ శానిటైజర్ల నాణ్యతను పరిశీలించారు. బిల్లులు లేకుండా శానిటైజర్లను దుకాణాలకు ఇచ్చినా, ఎవరికి వారు ఇష్టానుసారంగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ తనిఖీలు జరుగుతాయని అన్నారు.