ఒకప్పుడు అవార్డులు.. రివార్డులు.. ఇప్పుడు రోడ్డు పక్కన దుకాణంలో తినుబండారాలు అమ్ముతూ.. ఇతడెవరో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-07-24T20:49:47+05:30 IST

అతను జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాడు.. ఎన్నో ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని స్వర్ణ, కాంస్య, రజత పతాకాలు సాధించాడు..

ఒకప్పుడు అవార్డులు.. రివార్డులు.. ఇప్పుడు రోడ్డు పక్కన దుకాణంలో తినుబండారాలు అమ్ముతూ.. ఇతడెవరో తెలిస్తే..

అతను జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాడు.. ఎన్నో ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని స్వర్ణ, కాంస్య, రజత పతాకాలు సాధించాడు.. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం అతను దీన స్థితిలో ఉన్నాడు.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు రోడ్డు పక్కన దుకాణంలో తినుబండారాలు అమ్ముకుంటున్నాడు. జార్ఖండ్‌కు చెందిన ఆర్చర్ దీపికా కుమారి ప్రస్తుతం టోక్యో ఓలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తుంటే.. అదే రాష్ట్రానికి చెందిన జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాడు రాహుల్ కుమార్ పేదరికంలో మగ్గుతున్నాడు. 


2007లో కబడ్డీ ఆటగాడిగా కెరీర్ ప్రారంభించిన రాహుల్ కుమార్ అతి కష్టం మీద 2019 వరకు కెరీర్ కొనసాగించాడు. పాల్గొన్న అన్ని ఛాంపియన్‌షిప్‌లలోనూ ప్రతిభ చాటాడు. కొన్ని చోట్ల స్వర్ణ పతకాలు సాధించాడు. అయితే పేద కుటుంబం కావడం, బయటి నుంచి ప్రోత్సాహం లేకపోవడం రాహుల్ పాలిట శాపమైంది. తల్లిదండ్రలిద్దరూ రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని రాహుల్‌ను చదివించారు. ఇప్పుడు వారిద్దరూ వార్ధక్యానికి చేరుకోవడం, అనారోగ్య సమస్యల కారణంగా బడ్డీ కొట్టు కూడా నడపలేకపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ కోసం రాహుల్ ఆ బడ్డీ కొట్టునే ఆధారం చేసుకున్నాడు. 


కబడ్డీని పూర్తిగా పక్కన పెట్టి రోడ్డు పక్కన తిను బండారాలు అమ్ముతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్న ప్రోత్సాహం లభించినా తను కెరీర్‌పై దృష్టి సారిస్తానని, కబడ్డీలో రాష్ట్రానికి, దేశానికి వన్నె తీసుకొస్తానని రాహుల్ నమ్మకంగా చెబుతున్నాడు. ప్రభుత్వం నుంచి చిన్న ఆసరా లభించినా తన కొడుకు సత్తా చాటతాడని, కబడ్డీ గురించి తన కొడుకు ఏదైనా చేస్తాడని, ఎంత కష్టమైనా పడతాడని రాహుల్ తల్లి చెప్పారు.  

Updated Date - 2021-07-24T20:49:47+05:30 IST