కార్తీక దీపోత్సవం
ABN , First Publish Date - 2020-11-30T05:39:22+05:30 IST
కార్తీక దీపోత్సవం
వికారాబాద్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పూజలు మొదలయ్యాయి. ఆదివారం బుగ్గరామలింగేశ్వర ఆలయంలో వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక సోమవారం నేడు ఆలయాల్లో పూజలకు భక్తులు సిద్ధమయ్యారు.
ముస్తాబైన టేకులపల్లి శివాలయం
మోమిన్పేట: మోమిన్పేటతో పాటు ఆయా గ్రామాల్లో శివాలయాలు ముస్తాబయ్యాయి. కార్తీక శుద్ధ పౌర్ణమి మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక పౌర్ణమి పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి హరిహరులకు, శివుడికి ప్రీతిపాత్రమైన మాసం. శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన వారికి, ప్రమిదలు వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం.
అయ్యప్పస్వామి మహా పడిపూజ
సోమవారం అయ్యప్పస్వామి మహా పడిపూజ నిర్వహిస్తున్నట్టు గురుస్వాములు వేణు, రాంరెడ్డి ఆదివారం తెలిపారు. మోమిన్పేట- మర్పల్లి రోడ్డులో గల దత్తాత్రేయ ఆశ్రమ ఆవరణలో అయ్యప్ప గుడి శంకుస్థాపన, పడిపూజ నిర్వహిస్తారన్నారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ(తెలంగాణ) ఆధ్వర్యంలో సుధీర్ చంబూద్రి శబరిమల అయ్యప్ప గుడి పూజారి మేల్శాంతితో పూజ, మణికంఠ సేవాదళ్ ముత్తంగి వారి భజనలు ఉంటాయన్నారు. సోమవారం ఉదయం 5గంటల నుంచి లక్ష్మీగణపతి హోమం, వీరభద్రేశ్వరస్వామి ఆలయం నుంచి పూర్ణకుంభ ఊరేగింపుతో అయ్యప్ప పడిపూజకు చేరుకుంటారని తెలిపారు. అయ్యప్ప భక్తులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.
ఆలయాల్లో కార్తీక పూజలు
కొడంగల్ రూరల్: కొడంగల్లోని ఆలయాల్లో మహిళలు కార్తీక పూజలు నిర్వహించారు. ఆదివారం మహాదేవ, గాడిబావి శివాలయాల్లో దీపాలు వెలగించారు. మహాదేవ ఆలయ ఆవరణలో శివలింగాకృ తిలో దీపాలను వెలిగించి, ఉసిరి చెట్టుకు పూజలు చేశారు.
పాంబండపై దీపారాధన..
కులకచర్ల: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపారాధన చేశారు. మహిళలు దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.