‘హోంశాఖ దర్యాప్తు వెనుక కుట్ర’
ABN , First Publish Date - 2022-06-30T17:26:36+05:30 IST
రాష్ట్రంలోని పలు ప్రభుత్వశాఖలలో 40శాతం కమీషన్ ఆరోపణలపై హోంశాఖ నేరుగా రంగంలోకి దిగడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
బెంగళూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రభుత్వశాఖలలో 40శాతం కమీషన్ ఆరోపణలపై హోంశాఖ నేరుగా రంగంలోకి దిగడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేపీసీసీ అధికార ప్రతినిధి రమేశ్బాబు నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాం ట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ 40శాతం కమీషన్ వ్యవహారంపై ప్రధాని కార్యాలయానికి లేఖ రాసి ఏడాది అవుతోందన్నారు. ఇప్పుడు హోంశాఖ నేరుగా రంగంలోకి దిగడం, ఆధారాలు సమర్పించాలంటూ నోటీసు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. హోంశాఖ ద్వారా కాంట్రాక్టర్ల సంఘాన్ని బెదరించి దారిలోకి తెచ్చుకునేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి ఈ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హోంశాఖతో కాకుండా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 40శాతం కమీషన్ విషయంలో హోంశాఖ జోక్యం సర్వత్రా అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. మీడియా సమావేశంలో నగర మాజీ మేయర్ రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.