ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీ

ABN , First Publish Date - 2022-06-25T10:14:01+05:30 IST

ఆర్చరీ ప్రపంచ కప్‌ మూడో దశలో భారత్‌కు మరో పతకం ఖరారైంది.

ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీ

ఆర్చరీ ప్రపంచ కప్‌

భారత్‌కు మరో పతకం ఖాయం

‘వ్యక్తిగత’ పతక రేసులోనూ తెలుగు ఆర్చర్‌

పారిస్‌: ఆర్చరీ ప్రపంచ కప్‌ మూడో దశలో భారత్‌కు మరో పతకం ఖరారైంది. జ్యోతి సురేఖ-అభిషేక్‌ వర్మ ద్వయం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగం ఫైనల్లో అడుగుపెట్టింది. రికర్వ్‌ మహిళల టీం విభాగంలో దీపికా కుమారి త్రయం తుదిపోరుకు చేరి ఇప్పటికే పతకం ఖరారు చేయగా..జ్యోతి సురేఖ జోడీ రెండో పతకాన్ని భారత ఖాతాలో వేయనుంది. శుక్రవారం జరిగిన ఏకపక్ష సెమీఫైనల్లో జ్యోతి-అభిషేక్‌ 156-151తో అక్కాతమ్ముళ్లు లిసెల్‌ జాత్మ, రాబిన్‌ జాత్మ (ఎస్తోనియా)పై గెలుపొందారు. శనివారం జరిగే ఫైనల్లో ఐదో సీడ్‌ ఫ్రాన్స్‌ను ఎదుర్కొంటారు.


ఏడు నెలల తర్వాత తిరిగి పోటీలలో పాల్గొంటున్న ప్రపంచ మూడో ర్యాంకర్‌ జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో సెమీ్‌సకు చేరడం ద్వారా పతక రేసులో నిలిచింది. మిక్స్‌డ్‌ విభాగంలో సురేఖ-వర్మకు ప్రీక్వార్టర్స్‌లోకి బై లభించింది. ఈ రౌండ్‌లో 158-150తో ప్యూర్టోరికో జోడీపై భారత జంట అలవోకగా నెగ్గింది. కానీ రాబర్ట్‌-సోఫియా (ఎల్‌సాల్వడార్‌) ద్వయం క్వార్టర్స్‌లో జ్యోతి, అభిషేక్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో పోరు షూటా్‌ఫకు దారితీసింది. షూటా్‌ఫలో ఉత్కంఠను అదిమిపెట్టిన సురేఖ, వర్మ విజయం అందుకున్నారు. ఇక రికర్వ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో తరుణ్‌దీప్‌ రాయ్‌-అంకిత భక్త్‌ జోడీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. 

Updated Date - 2022-06-25T10:14:01+05:30 IST