‘జ్యోతిలక్ష్మి’ పట్టుబడింది!
ABN , First Publish Date - 2022-06-25T07:13:39+05:30 IST
బంగారు ఆభరణాల చోరీ కేసులో తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కోయ లక్ష్మి అలియాస్ జ్యోతిలక్ష్మిని అరెస్టు చేసినట్టు అమలాపురం పట్టణ సీఐ ఎస్సీహెచ్ కొండలరావు తెలిపారు.
- ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 56 ఏళ్ల కోయ లక్ష్మి అలియాస్ జ్యోతిలక్ష్మిపై 14 పోలీసు స్టేషన్లలో కేసులు
- జ్యోతి, కృప, కవిత, భర్త, రాము, వెంకటరామకృష్ణ, సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆమె పేర్లే.. ఒక్కోచోట ఒక్కో పేరు..
- అమలాపురంలో బంగారు ఆభరణాల చోరీ కేసులో అరెస్టు
- రూ.7.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
అమలాపురం టౌన్, జూన్ 24 : బంగారు ఆభరణాల చోరీ కేసులో తిరుపతి జిల్లా రేణిగుంట మండలం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కోయ లక్ష్మి అలియాస్ జ్యోతిలక్ష్మిని అరెస్టు చేసినట్టు అమలాపురం పట్టణ సీఐ ఎస్సీహెచ్ కొండలరావు తెలిపారు. ఆమె వద్ద నుంచి రూ.7.50 లక్షల విలువైన 20 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోన సీమ జిల్లా అమలాపురం పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావే శంలో కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన సుంకర వెంకటేశ్వరి ఈనెల 16న స్వగ్రామం నుంచి అమలాపురం వస్తుండగా బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. వెంకటేశ్వరి అదే రోజున అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురు వారం అందిన సమాచారంతో అమలాపురం దేవాంగుల వీధి శివారు కుళాయి చెరువుగట్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న కోయ లక్ష్మి (56)ని సీఐ ఏసీహెచ్ కొండలరావు, పట్టణ ఎస్ఐ గంగాభవానీ అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించి 160. 075 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 56 ఏళ్ల అలియాస్ జ్యోతిలక్ష్మి అసలు పేరు కోయ లక్ష్మి. ఉభయ తెలుగు రాష్ట్రా ల్లో ఇప్పటివరకు ఆమెపై 14 పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఆమె చెలామణి అవుతోంది. అంతర్రాష్ట్ర దొంగగా గుర్తింపు పొందిన లక్ష్మి అలియాస్ కోయ జ్యోతి, అలియాస్ ఆకుల జ్యోతిలక్ష్మి, అలియాస్ కృప, అలియాస్ కవిత, అలియాస్ భర్త, అలియాస్ రాము, అలియాస్ వెంకటరామకృష్ణ, అలియాస్ సుబ్రహ్మ ణ్యంగా పేరొందింది. అలియాస్ జ్యోతిలక్ష్మిపై వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పోలీసులు పీడీ యాక్టు అమలుచేశారు. ఆయా నగరాల బహిష్కరణతో కోనసీమను ఎంచుకుని ఇక్కడ దొంగతనాలు ప్రారంభించింది. అరెస్టు చేసిన కోయ లక్ష్మిని శుక్రవారం జ్యుడీషియల్ రిమాండు నిమిత్త అమలాపురం కోర్టులో హాజరుపరిచారు. రోజుల వ్య వధిలోనే ఈ చోరీ కేసును ఛేదించిన సీఐ కొండలరావు, ఎస్ఐ గంగాభ వాని, క్రైం పార్టీ ఏఎస్ఐ అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, మామిళ్లపల్లి సుబ్బరాజు, కానిస్టేబుళ్లు గుబ్బల కృష్ణసాయి, దొంగ అర్జున్లను ఎస్పీ సుబ్బారెడ్డి అభినందించారు.