ఎలక్ర్టీషియన్కు న్యాయం చేయాలని రైతుల ధర్నా
ABN , First Publish Date - 2021-07-25T05:32:24+05:30 IST
విద్యుదాఘాతానికి గురైన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తర్లుపాడు సబ్ స్టేషన్లో రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. చెన్నారెడ్డిపల్లె ఫీడర్లోని ట్రాన్స్ఫార్మర్కు లెగ్ ఫీజు వేసేందుకు ఈర్ల రమణ స్తంభం ఎక్కి విద్యుత్ షాక్కు గురైన విషయం తెలిసిందే. లైన్మెన్ వెంకటేశ్వరరెడ్డి ఎల్సీ తీసుకున్నానని చెప్పడంతో రమణ పోల్ ఎక్కి ఫీజు వేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని రైతులు తెలిపారు. షిప్ట్ ఆపరేటర్ మాత్రం శుక్రవారం 4.56 నిమిషాలకు ఎల్సీ లైన్మెన్ తీసుకున్నాడని తెలిపారు.
తర్లుపాడు, జూలై 24 : విద్యుదాఘాతానికి గురైన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తర్లుపాడు సబ్ స్టేషన్లో రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. చెన్నారెడ్డిపల్లె ఫీడర్లోని ట్రాన్స్ఫార్మర్కు లెగ్ ఫీజు వేసేందుకు ఈర్ల రమణ స్తంభం ఎక్కి విద్యుత్ షాక్కు గురైన విషయం తెలిసిందే. లైన్మెన్ వెంకటేశ్వరరెడ్డి ఎల్సీ తీసుకున్నానని చెప్పడంతో రమణ పోల్ ఎక్కి ఫీజు వేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని రైతులు తెలిపారు. షిప్ట్ ఆపరేటర్ మాత్రం శుక్రవారం 4.56 నిమిషాలకు ఎల్సీ లైన్మెన్ తీసుకున్నాడని తెలిపారు. ఇద్దరి మధ్యా సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని రైతులు తెలిపారు. రమణ తీవ్ర గాయాలతో ప్రస్తుతం రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. లైన్మెన్ వెంకటేశ్వరరెడ్డి, షిప్ట్ ఆపరేటర్ మాల్యాద్రిపై చర్య తీసుకోవడంతోపాటు ఎలక్ర్టీషియన్ రమణకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న మార్కాపురం ఏడీఏ శ్రీనివాసులరెడ్డి తర్లుపాడు సబ్స్టేషన్కు వచ్చి రైతులతో చర్చించారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఏళ్ల శ్రీనివాసులు, ఆంజనేయులు, తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, వెంకటాద్రి వీరితో పాటు మరో 25 మంది రైతులు పాల్గొన్నారు.
పనిచేసే చోట సిబ్బంది ఉండాలి
లైన్మెన్లు పనిచేసే గ్రామంలోనే ఖచ్చితంగా నివాసం ఉండేలా ఆదేశాలు ఇస్తున్నట్లు ఏడీఏ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒక గ్రామంలో పనిచేస్తూ వేరే చోట ఉండకూడదన్నారు. పనిచేసే చోట ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.