భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌

ABN , First Publish Date - 2022-08-11T08:48:15+05:30 IST

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌

ఆమోద్రముద్ర వేసిన రాష్ట్రపతి ముర్ము

26న జస్టిస్‌ రమణ పదవీ విరమణ

27న జస్టిస్‌ లలిత్‌ సీజేఐగా బాధ్యతలు


న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌) నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆగస్టు 27 నుంచి జస్టిస్‌ లలిత్‌ నియామకం అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... జస్టిస్‌ లలిత్‌ నియామకానికి బుధవారం ఆమోదముద్ర వేశారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా ఆగస్టు 3న కేంద్ర న్యాయశాఖ జస్టిస్‌ ఎన్వీ రమణను కోరింది. న్యాయవ్యవస్థ సంప్రదాయాల ప్రకారం... తన తర్వాత అత్యంత సీనియర్‌ అయిన న్యాయమూర్తిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ సిఫార్సు చేస్తారు. ఈ మేరకు జస్టిస్‌ రమణ... తన తర్వాత సీనియర్‌ అయిన జస్టిస్‌ లలిత్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని న్యాయశాఖకు సిఫార్సు చేశారు. దీనికి న్యాయశాఖ, ప్రధాని, అంతిమంగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామక ప్రక్రియ పూర్తయింది.


దీంతో ఆగస్టు 27న జస్టిస్‌ యూయూ లలిత్‌ భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన పదవీకాలం మూడు నెలల్లోపే ముగియనుంది. నవంబరు 8వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 1957 నవంబరు 9న జన్మించిన జస్టిస్‌ యూయూ లలిత్‌... 1983లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం 1986 నుంచి 1992 వరకు మాజీ అటార్నీ జనరల్‌ సోలి సొరాబ్జీతో కలిసి పనిచేశారు. క్రిమినల్‌ కేసుల్లో అత్యంత నిష్ణాతుడైన న్యాయవాదిగా పేరుపొందారు. 2004లో సుప్రీం కోర్టు జస్టిస్‌ లలిత్‌ను సీనియర్‌ న్యాయవాదిగా నియమించింది. ఆ తర్వాత 2014 ఆగస్టు 13న సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తీర్పు ఇచ్చిన బెంచ్‌లో జస్టిస్‌ లలిత్‌ కూడా ఉన్నారు. అలాగే ట్రావెన్‌కోర్‌లోని శ్రీపద్మనాభస్వామి ఆలయ పాలనా వ్యవహారాలను అక్కడి రాజ కుటుంబం నుంచి కోర్టు నియమించిన కమిటీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనంలోనూ జస్టిస్‌ లలిత్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-11T08:48:15+05:30 IST