‘న్యాయమే’ శిరోధార్యం

ABN , First Publish Date - 2021-07-23T09:26:38+05:30 IST

రాజధాని అమరావతిపై ప్రభుత్వం చేసిన ప్రధానమైన ఆరోపణ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. ఈ ఆరోపణను సుప్రీం ధర్మాసనం సైతం పూర్తిస్థాయిలో పరిశీలించి కొట్టివేసింది...

‘న్యాయమే’ శిరోధార్యం

రాజధాని అమరావతిపై ప్రభుత్వం చేసిన ప్రధానమైన ఆరోపణ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. ఈ ఆరోపణను సుప్రీం ధర్మాసనం సైతం పూర్తిస్థాయిలో పరిశీలించి కొట్టివేసింది. భూముల కొనుగోలులో విశ్వాసఘాతుకం,మోసం లాంటివి ఏమీ జరగలేదని తేల్చింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అనే అబద్ధాన్ని పట్టుకుని వేళ్ళాడుతుందా? న్యాయస్థానం తీర్పును గౌరవించి మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటుందా? ఇది ఆంధ్రులకు అవసరమైన ప్రశ్న. రాజధాని ఒక సామాజిక వర్గందే అనీ, స్మశానం అనీ, వరదలు వస్తాయనీ, భూముల్లో సారం లేదనే పుకార్లను ప్రచారం చేశారు. ఇవేవీ నిజాలు కావని అమరావతి ఉద్యమకారులు నిరూపించారు. రాజధాని ఉద్యమంలో దళిత బహుజన కులాల వారు అగ్రభాగాన నిలిచారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చినా, రాజధాని గ్రామాల్లోకి చుక్క నీరు రాలేదు. ప్రభుత్వపెద్దలు అంటున్న స్మశానం, ఎడారి ప్రాంతాల నుంచే రెండేళ్లుగా వైకాపా పాలన సాగుతోంది. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కూడా అమరావతిలోనే అందమైన ఇల్లు, కార్యాలయం కట్టుకొని రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని అబద్ధాలు ఓడిపోయాక ప్రభుత్వం ఏం చేయాలి? వెనక్కి తగ్గాలి. న్యాయస్థానాల తీర్పులు వచ్చాక కూడా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై మాట్లాడితే న్యాయస్థానాన్ని అగౌరవపరిచినట్లే. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వానికి న్యాయస్థానాలు తీర్పులు శిరోధార్యం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లుతోపాటు ఆ బిల్లుకు మద్దతు పలకని మండలికి ‘దద్దమ్మల’ సభగా పేరుపెట్టి శాసనమండలి రద్దు బిల్లునూ ప్రవేశపెట్టారు. అయినా మళ్లీ మండలికి సభ్యులను నియమి స్తూనే ఉన్నారు. అంటే శాసనమండలి బిల్లును నిలిపివేసినట్లా? కొనసాగిస్తున్నట్లా? శాసనమండలిని కొనసాగించినప్పుడు అమరావతిని కొనసాగించడంలో తప్పేముంది? ప్రజాస్వామిక వ్యవస్థకు కట్టుబడ్డ ఏ ప్రభుత్వం అయినా అది తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో నిలబడకపోతే వెనక్కి తగ్గాలి. గతంలో ప్రభుత్వ నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోయినప్పుడు అప్పటి ప్రభుత్వాలు చేసిన పని అదే. అలా కాదని రాజకీయ పగతోనో, రాజధానిపై కక్షతోనో ఏపీకి మరో మూడేళ్ల పాటు రాజధానిని దూరం చేసి, దేశ ప్రజల ముందు రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టాలని చూస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. ప్రజాస్వామిక న్యాయవిలువలను అగౌరవపరిస్తే, అవి మెడకు చుట్టుకుని బోనెక్కక తప్పదు.

పోతుల బాలకోటయ్య 

Updated Date - 2021-07-23T09:26:38+05:30 IST