ఏబీఎన్ బయటపెట్టిన సంచలన ఆడియో టేప్పై జస్టిస్ ఈశ్వరయ్య వివరణ
ABN , First Publish Date - 2020-08-09T21:10:48+05:30 IST
ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.
అమరావతి/హైదరాబాద్ : ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఆడియో టేప్లోని గొంతు జస్టిస్ ఈశ్వరయ్యదేనని బెంగళూరుకు చెందిన ట్రూత్ల్యాబ్ నిర్ధారించింది. ఆ ఆడియో టేప్ను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసింది. అటు ఆంధ్రజ్యోతి దినపత్రిక.. ఇటు ఏబీఎన్లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు ఈ ఆడియో వ్యవహారంపై ఈశ్వరయ్య మీడియా మీట్ నిర్వహించి వివరణ ఇచ్చుకున్నారు.
ఆ వాయిస్ నాదే..
‘రామకృష్ణతో మాట్లాడింది నేనే..ఆ వాయిస్ నాదే. రామకృష్ణకు హెల్ప్ చేద్దామని ప్రయత్నించాను. రామకృష్ణతో మాట్లాడిన ఆడియోను బయటికి తీసి.. నన్ను అల్లరి చేయాలనుకుంటున్నారు. నాకు న్యాయ వ్యవస్థ పట్ల.. జడ్జిల పట్ల గౌరవం ఉంది’ అని ఈశ్వరయ్య చెప్పుకొచ్చారు.
మెప్పు కోసం కాదు..!
ఈ సందర్భంగా తనను తాను సమర్థించుకుంటూ ఓ పుస్తకంలో జస్టిస్ రమణకు, టీడీపీ అధినేత మధ్య ఉన్న అనుబంధాన్ని పుంకాను పుంకాలుగా చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూడవచ్చని కూడా ఆయన తెలిపారు. ‘నేను చేసిన సంభాషణ మొత్తం కేవలం దృష్టితో మాత్రమే చూడాలి. మాజీ జడ్జి రామకృష్ణతో నేను చేసిన సంభాషణ ఒక వ్యవస్థలో బలిపశువైనటువంటి వ్యక్తికి ఊరట కలిగించే విషయాలుగా మాత్రమే చూడాలి. అంతే తప్ప నేను ప్రస్తుతం నిర్వర్తించే పదవికిగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికిగానీ అంటగట్టడం ఆక్షేపణీయం. ఇంతవరకూ నేను చేసిన ఉద్యమం, మాట్లాడిన మాటలు ఏ పదవి కోసమో, పరిపాలించే వారి మెప్పు కోసమో చేసినవి కావు.. ప్రజల సంక్షేమం కోసం మాత్రమే నేను చేశాను. సామాజిక న్యాయ పరిరక్షణ కోసం చేసినవి’ అని జస్టిస్ ఈశ్వరయ్య వివరణ ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని బీసీలకు అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే బీసీ సంఘాలు మాత్రం ఈశ్వరయ్యకు మద్దతుగా నిలవలేదు. ఇది ఆయన వ్యక్తిగత వ్యవహారమని బీసీ సంఘాలు దూరంగా ఉన్నాయి. తను చెప్పాల్సింది చెప్పిన ఈశ్వరయ్య విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోవడం గమనార్హం.