ఒక దశలో చచ్చిపోదామనుకున్నా: మేఘన్ మార్కెల్

ABN , First Publish Date - 2021-03-08T19:07:02+05:30 IST

రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత ప్రిన్స్ హ్యారీ దంపతులు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

ఒక దశలో చచ్చిపోదామనుకున్నా: మేఘన్ మార్కెల్

న్యూయార్క్: రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత ప్రిన్స్ హ్యారీ దంపతులు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ఈ దంపతులు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మేఘన్ మార్కెల్ మాట్లాడుతూ రాజకుటుంబం తనపై నిందలు వేసిందని, ఒక దశలో చచ్చిపోదామనుకున్నానన్నారు. 


ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకుని.. బ్రిటన్‌ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. డిప్రెషన్‌లో ఉంటే కుటుంబంలో ఎవరూ తనకు సాయం చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా తనపైనే అసత్య ప్రచారం చేశారన్నారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్నారు. రాజకుటుంబంలో తనకు రక్షణ ఉండదని పెళ్లైన కొద్దిరోజులకే అర్థమైందని ఆమె అన్నారు. తాను గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ రంగు మీద రాజ కుటుంబంలో చర్చ జరిగిందని, తాను నల్లగా ఉంటాను కాబట్టి తన బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని కుటుంబంలోని వారు అనేవారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.


ఈ సందర్భంగా హ్యారీ కూడా మాట్లాడుతూ తను కేవలం మేఘన్ కోసమే రాజకుటుంబం నుంచి బయటకు రాలేదన్నారు. తనను ట్రాప్ చేశారని, అందులో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదన్నారు. తన తండ్రి, సోదరుడిని కూడా ట్రాప్ చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యరీ దంపతులు ఓ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తమకు ఆడపిల్ల పుట్టనున్నదని చెప్పారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు.

Updated Date - 2021-03-08T19:07:02+05:30 IST