యువ భారత్కు షాక్
ABN , First Publish Date - 2021-12-04T08:46:29+05:30 IST
వరుసగా రెండోసారి జూనియర్ హాకీ విశ్వవిజేతగా నిలవాలన్న భారత జట్టు ఆశలపై జర్మనీ నీళ్లు చల్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 4-2తో టీమిండియాకు షాకిచ్చింది.
భువనేశ్వర్: వరుసగా రెండోసారి జూనియర్ హాకీ విశ్వవిజేతగా నిలవాలన్న భారత జట్టు ఆశలపై జర్మనీ నీళ్లు చల్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 4-2తో టీమిండియాకు షాకిచ్చింది. భారత్ తరపున సుదీప్ (25 ని.), థామీ బాబీసింగ్ (60) గోల్స్ సాధించారు. ఎరిక్ (15), ఫిలిప్ (21), కెప్టెన్ ముల్లర్ (24), క్రిస్టోఫర్ (25) జర్మనీకి గోల్స్ అందించారు. అంతకుముందు జరిగిన తొలి సెమీ్సలో అర్జెంటీనా పెనాల్టీ షూటవుట్లో 3-1తో ఫ్రాన్స్పై నెగ్గింది. జర్మనీ-అర్జెంటీనా మధ్య ఆదివారం ఫైౖనల్ జరగనుంది. క్వార్టర్ఫైనల్లో బెల్జియంపై అద్భుతంగా ఆడిన భారత్..జర్మనీతో సెమీ్సలో పూర్తిగా తేలిపోయింది. డిఫెండర్లు, ఫార్వర్డ్ల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపించింది. తొలి క్వార్టర్నుంచే దూకుడుగా ఆడిన జర్మనీ మ్యాచ్ ఆసాంతం దానిని కొనసాగించింది. ఇక కాంస్య పతకం కోసం ఆదివారం జరిగే పోరులో ఫ్రాన్స్తో టీమిండియా తలపడనుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్లో ఫ్రాన్స్ చేతిలో భారత్ 4-5తో కంగుతిన్న సంగతి తెలిసిందే.
కరోనా కలకలం
సాఫీగా సాగుతున్న జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీలో కరోనా కలకలం రేగింది. శుక్రవారం ఓ కరోనా కేసు వెలుగు చూసింది. కళింగ స్టేడియంలోని మీడియా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించగా అతడు వైరస్ బారినపడ్డట్టు నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ఒడిశా ప్రభుత్వంలో క్రీడా శాఖలో పని చేస్తూ మీడియా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.