‘గ్రూప్-1’లో జంబ్లింగ్
ABN , First Publish Date - 2022-10-08T10:06:49+05:30 IST
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది.
- ప్రశ్నపత్రాల సెట్ల పేర్లలోనూ మార్పులు
- ఎ,బి,సి,డిలకు బదులు నంబర్లు.. రేపటి నుంచి హాల్టికెట్లు
- 16న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష
- రాష్ట్రవ్యాప్తంగా 1041 కేంద్రాలు.. ఏర్పాట్లు పూర్తి: టీఎస్పీఎస్సీ
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది. దీన్ని అనుసరించి.. పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది. సాధారణంగా ఎ,బి,సి,డి అక్షరాలతో ప్రశ్నపత్రాల సెట్లను సిద్ధం చేస్తారు. అయితే ఈసారి అలా కాకుండా 001 లేదా 101 వంటి నంబర్లతో కూడిన సెట్లను రూపొందిస్తున్నారు. తద్వారా పరీక్ష కేంద్రంలో ఏ అభ్యర్థికి ఏ సెట్ ప్రశ్న పత్రం వచ్చిందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. దాంతో అక్రమాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు తమకు వచ్చిన సెట్ నంబరును జవాబు పత్రంలో నింపాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. 9వ తేదీ నుంచి హాల్టికెట్లను జారీచేయనున్నారు. మొత్తం 503 పోస్టుల కోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,041 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రంలో హాల్ సైజ్ను బట్టి ఒక్కో హాల్లో 24 మంది లేదా, 36 లేదా 48 మంది అభ్యర్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషన్ ఛైర్మన్ జనార్దన్రెడ్డి చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు.
కొత్త రోస్టర్ వచ్చాకే నోటిఫికేషన్లు..!
కాగా, రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజా నోటిఫికేషన్లను విడుదల చేయాలంటే... కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఆయా విభాగాలు మళ్లీ రోస్టర్ పాయింట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ రోస్టర్ విధానం ఖరారైన తర్వాతే కొత్త నోటిఫికేషన్లను జారీ చేయాలని టీఎ్సపీఎ్ససీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు రాగా... మరికొన్నింటికి విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇటీవల గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇక నుంచి మారిన రిజర్వేషన్ల ప్రకారం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖలు రోస్టర్ పాయింట్లను రూపొందించాలి. దాని అధారంగానే ఆయా వర్గాలకు పోస్టులను కేటాయించి, అనంతరం నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు.
పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్
పాత రిజర్వేషన్ల విధానం ఆధారంగానే ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ను నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను గతంలోనే విడుదల చేశారు. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్ శాతాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ను పాత రిజిర్వేషన్ల ప్రకారమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
10 తర్వాత ఫీజులపై ఉత్తర్వులు..!
ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఆలోగా ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలను అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఏఎ్ఫఆర్సీ) ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. అయితే వరుసగా సెలవులు రావడంతో దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. సోమవారం తర్వాత ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు రావొచ్చు.
సోమవారం నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం
మరోవైపు.. దసరా సెలవుల అనంతరం సోమవారం నుంచి (10వ తేదీ) రాష్ట్రంలోని విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు తదితర అన్ని రకాల విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. సెప్టెంబరు 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
ఐసెట్ కౌన్సెలింగ్ను ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి అభ్యర్థులు స్లాట్ను బుక్ చేసుకోవాలి. తర్వాత 10 నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే 10 నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.
దోస్త్ చివరి దశ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన దోస్త్ చివరి దశ (స్పెషల్ రౌండ్) కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సి ఉంది. అయితే దసరా సెలవులు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అలాగే అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను కూడా 11వ తేదీ లోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.