జూలైలో.. Covid నాలుగో వేవ్
ABN , First Publish Date - 2022-04-13T12:23:49+05:30 IST
రాష్ట్రంలో జూలైలో కొవిడ్ నాల్గవ వేవ్ వచ్చే సంకేతాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే తాజా మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆరోగ్యశాఖ
- వైద్యనిపుణల హెచ్చరిక
- విదేశీ ప్రయాణికులపై నిఘా
- ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్
బెంగళూరు: రాష్ట్రంలో జూలైలో కొవిడ్ నాల్గవ వేవ్ వచ్చే సంకేతాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే తాజా మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ మంగళవారం మీడియాకు తెలిపారు. మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు విడతల కొవిడ్ వైర్సను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. రాష్ట్ర ప్రజల పరిపూర్ణ ఆరోగ్యానికి పూర్తిగా భరోసా ఇస్తున్నామన్నారు. కొవిడ్ నాల్గవ దశను ఎదుర్కొనేందుకు సైతం సన్నద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచంలోని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ తదితర 8 దేశాలలో కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగు చూసిందని, ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై నిఘా విధించామన్నారు. ఈ దేశాల నుంచి విచ్చేసే ప్రయాణికులకు థర్మల్ స్ర్కీనింగ్ జరుపుతున్నామన్నారు. అనంతరం ఒకవారం పాటు వారికి టెలీ మానిటరింగ్ జరపాలని అధికారులకు సూచించామన్నారు. ముందు జాగ్రత్తగా మాస్క్ను ధరించాలని ప్రజలకు సూచించారు. తొలి డోసు 4.97 కోట్ల మందికి, రెండోడోసును 4.77 కోట్ల మందికి ఇచ్చామన్నారు. ఇంకా 20 లక్షల మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉందన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ ప్రక్రియను వేగిరం చేస్తున్నామన్నారు. 70 సంవత్సరాలు పైబడిన వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ వేళ ఆరోగ్య సాధనాలు, ఔషధాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు నిరాధారమన్నారు. సమావేశంలో బెంగళూరు దక్షిణ బీజేపీ అధ్యక్షు డు ఎన్ఆర్ రమేశ్ కూడా పాల్గొన్నారు.