2022 మార్చి నాటికి సెన్సెక్స్ @ 58,500
ABN , First Publish Date - 2021-06-16T06:12:51+05:30 IST
భారత స్టాక్ మార్కెట్ కరోనా రెండో దశ ఉధృతిని తట్టుకొని నిలబడగలిగిందని అంతర్జాతీయ వెల్త్ మేనేజ్మెంట్ దిగ్గజ సంస్థ జూలియస్ బేర్ పేర్కొంది. ప్రస్తుత బుల్ ట్రెండ్ను బట్టి చూస్తే, వచ్చే ఏడాది
జూలియస్ బేర్ అంచనా
న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్ కరోనా రెండో దశ ఉధృతిని తట్టుకొని నిలబడగలిగిందని అంతర్జాతీయ వెల్త్ మేనేజ్మెంట్ దిగ్గజ సంస్థ జూలియస్ బేర్ పేర్కొంది. ప్రస్తుత బుల్ ట్రెండ్ను బట్టి చూస్తే, వచ్చే ఏడాది మార్చి నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ 58,500 స్థాయికి చేరుకోవచ్చని అంటోంది. భారత్ చాలా పటిష్ఠమైన మార్కెట్ అని, మున్ముందు మరింత మెరుగవనున్న కంపెనీల పనితీరు వాటి షేర్ల ధరలకు చోదకంగా పనిచేయనుందని జూలియస్ బేర్ ఎండీ, రీసెర్చ్ హెడ్ మార్క్ మాథ్యూస్ అన్నారు. ప్రస్తుత కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల సీజన్ కూడా ఆశాజనకంగా ఉందన్నారు. కరోనా రెండో ఉధృతి దేశ ఆర్థిక కార్యకలాపాలపై గణనీయ ప్రభావం చూపినప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం గడిచిన కొన్ని నెలల్లో ఎగువముఖంగానే పయనించాయి. జొమాటో, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ వంటి ఇంటర్నెట్ కంపెనీల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనున్నాయని మాథ్యూస్ అభిప్రాయపడ్డారు.
మార్కెట్లో మళ్లీ ఆల్టైం రికార్డు : దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. మంగళవారం ట్రేడింగ్లో బీఎ్సఈ సెన్సెక్స్ 52,869.51 వద్ద, ఎన్ఎ్సఈ నిఫ్టీ 15,901.60 వద్ద ఆల్టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 221.52 పాయింట్ల లాభంతో 52,773.05 వద్ద, నిఫ్టీ 57.40 పాయింట్ల లాభంతో 15,869.25 వద్ద సరికొత్త ముగింపు గరిష్ఠాలను నమోదు చేసుకున్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ కూడా సరికొత్త రికార్డు స్థాయి రూ.231.58 లక్షల కోట్లకు చేరుకుంది. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు ముందుకు పయనించాయి. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 831.41 పాయింట్లు బలపడగా.. మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.3.78 లక్షల కోట్లకు పైగా పెరిగింది.