కేంద్ర మంత్రి తనయుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2021-10-10T21:39:45+05:30 IST

లఖింపూర్ హింసాత్మక ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు జ్యుడిషియల్ ..

కేంద్ర మంత్రి తనయుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

లక్నో: లఖింపూర్ హింసాత్మక ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. యూపీలోని లఖింపూర్ ఖేరి క్రైం బ్రాంచ్ కార్యాలయంలో 12 గంటల పాటు ఆశిష్ మిశ్రాను ప్రశ్నించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆయన 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించినట్టు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్‌పీ యాదవ్ తెలిపారు. పోలీస్ రిమాండ్‌ కోరుతూ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌కు అప్లికేషన్ సమర్పించామని, ఈనెల 11న విచారణ తేదీని ఆయన ఖరారు చేశారని ఆయన చెప్పారు.


ఈనెల 3న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా లఖింపూర్ కేరిలో నిరసనలకు దిగిన రైతులపై వాహనాన్ని నడపి, నలుగురు రైతుల మృతికి కారణమయ్యాడంటూ ఆశిష్ మిశ్రా పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలంటూ రైతు నేతలు డిమాండ్ చేయగా, ఆ ఆరోపణను అజయ్ మిశ్రా, ఆశిష్ మిశ్రాలు తోసిపుచ్చారు. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 8 మంది మృతి చెందారు.

Updated Date - 2021-10-10T21:39:45+05:30 IST