జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు, పోస్టింగ్
ABN , First Publish Date - 2021-07-25T06:27:24+05:30 IST
జిల్లాలో ఇద్దరు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీచేసి, ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులను భర్తీ చేస్తూ హైకోర్టు రిక్రూట్మెంట్ రిజిస్ట్రార్ సునీల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
తిరుపతి(లీగల్), జూలై 24: జిల్లాలో ఇద్దరు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీచేసి, ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులను భర్తీ చేస్తూ హైకోర్టు రిక్రూట్మెంట్ రిజిస్ట్రార్ సునీల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి మూడో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి డి.సౌజన్య విజయనగరం జిల్లా పార్వతీపురానికి బదిలీ అయ్యారు. ఈమె స్థానంలో గుంటూరుకు చెందిన ఎస్పీడీ వెన్నెల రానున్నారు. చిత్తూరు మూడో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎం.సరోజమ్మ విజయనగరం జిల్లా బొబ్బిలికి బదిలీ కాగా.. ఈమె స్థానంలో శ్రీకాకుళం నరసన్నపేటకు చెందిన గ్రంథి శ్రీనివాస్ రానున్నారు. అలాగే పుత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా ఎస్.అరుణశ్రీ, పుంగనూరు జూనియర్ సివిల్ జడ్జిగా జి.కార్తిక్, తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జిగా కె.భరత్చంద్ర, కుప్పం అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంఎస్ భారతిలను నియమించారు. వీరు ఆగస్టు మూడో తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.