సబ్ జైలులో సౌకర్యాలపై జడ్జిల తనిఖీలు
ABN , First Publish Date - 2022-06-26T06:14:41+05:30 IST
స్థానిక సబ్ జైలులో సౌకర్యాలు, ఖైదీల పరిస్థితిపై శనివారం స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి ఎస్. అరుణశ్రీ, ప్రిన్సిపల్జూనియర్ సివిల్ జడ్జి డి. ఉమాదేవి తనిఖీలు నిర్వహించారు.
సబ్ జైలులో ఖైదీలకు న్యాయ అవగాహన
చోడవరం, జూన్ 25: స్థానిక సబ్ జైలులో సౌకర్యాలు, ఖైదీల పరిస్థితిపై శనివారం స్థానిక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి ఎస్. అరుణశ్రీ, ప్రిన్సిపల్జూనియర్ సివిల్ జడ్జి డి. ఉమాదేవి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యత, జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం జైలు సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్జైలు ప్రాంగణంలోనే న్యాయమూర్తులు ఖైదీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి అరుణశ్రీ మాట్లాడుతూ, చాలామంది చట్టంపై అవగాహన లేక తప్పేం ఉండదన్న ఉద్దేశంతో తప్పులు చేసి, జైలుకి వస్తున్నారన్నారు. చట్టాలపై అవగాహన లేక నిర్లక్ష్యంతో చేసే నేరాలు వల్ల అనవసరంగా జైలుకు వచ్చి కుటుంబాలను ఇబ్బంది పడుతున్నారన్నారు. నేరాలకు దూరంగా ఉంటే ప్రతి ఒక్కరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయన్నారు. ఎవరైనా సరే చట్టాలకు లోబడి వ్యవహరించాలని, చట్టాలను ధిక్కరించే తప్పులు ఎవరూ చేయవద్దని సూచించారు. ఎవరికైనా బెయిలు పెట్టే ఆర్థిక పరిస్థితి లేనట్టయితే వారు దరఖాస్తు చేసుకుంటే న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని జడ్జిలు తెలిపారు.