జడ్జి రామకృష్ణ అరెస్టు.. జైలుకు

ABN , First Publish Date - 2021-04-16T09:59:59+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. గు

జడ్జి రామకృష్ణ అరెస్టు.. జైలుకు

సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యల ఆరోపణ


పీలేరు, ఏప్రిల్‌ 15: ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఆయనను పీలేరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ నెల 28 వరకూ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పీలేరు సబ్‌ జైలుకు తరలించారు. కేవీ పల్లె మండలానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసు స్టేషన్‌లో బుధవారం జడ్జి రామకృష్ణపై కేసు నమోదైంది.


అమెరికా మానవ హక్కుల నివేదిక-2020పై ఈ నెల 12న జరిగిన టీవీ డిబేట్‌లో సీఎం జగన్‌పై జడ్జి రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గురువారం మధ్యాహ్నం జడ్జి రామకృష్ణను మదనపల్లె పోలీసులు అదుపులోకి తీసుకుని పీలేరు పోలీసులకు అప్పగించారు. గురువారం జడ్జి రామకృష్ణ బి.కొత్తకోట నుంచి మదనపల్లెకు రావడంతో అక్కడ అదుపులోకి తీసుకుని పీలేరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రిమాండ్‌ రిపోర్టును సాయంత్రానికిగానీ పోలీసులు సిద్ధం చేయలేదు. దీంతో కోర్టులో హాజరుపరిచేందుకు ఆలస్యమైంది. 


సీఎం పతనానికి నాంది: జడ్జి రామకృష్ణ

తప్పుడు కేసుతో తనను అరెస్టు చేయడంతోనే సీఎం జగన్‌ పతనం ప్రారంభమైందని జడ్జి రామకృష్ణ పేర్కొన్నారు. దళితుల పక్షం వహించి టీవీ డిబేట్‌లో ప్రశ్నించినందుకు తనపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలను  జడ్జి రామకృష్ణ గుర్తు చేశారు. దళితులను అణగదొక్కడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రశ్నించినందుకే తనను దేశ ద్రోహిగా ప్రభుత్వం చిత్రిస్తోందని ఆక్రోశించారు. 

Updated Date - 2021-04-16T09:59:59+05:30 IST