TS News: జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్
ABN , First Publish Date - 2022-07-27T21:09:08+05:30 IST
జూబ్లీహిల్స్ (Jubilee Hills) రేప్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి హైకోర్టు (High Court) బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) రేప్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి హైకోర్టు (High Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్కు వచ్చిన మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. మరో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టు (Remand Report)లో పేర్కొన్నారు. నిందితుల్లో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారులున్నారు.
ఈ కేసులో నేరాలు నిర్ధారణ అయితే.. నిందితులకు 20 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈ కేసులో జువైనల్ హోమ్లో ఉన్న నలుగురికి మంగళవారం బెయిల్ (Bail) వచ్చింది. ఈ కేసులో పోలీసులు 420 పేజీలతో చార్జిషీట్ సిద్ధం చేశారు. ఫోరెన్సిక్, వైద్యుల నివేదికలను ఈ చార్జిషీట్లో ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఎక్కడా లోటుపాట్లు లేకుండా.. నిందితులకు కఠిన శిక్ష పడేలా సిద్ధం చేసిన చార్జిషీట్ను తొలుత న్యాయనిపుణుల సలహా కోసం పంపినట్లు తెలిసింది. నిజానికి ఈ కేసు పోక్సో సెక్షన్ కింద నమోదైంది.