నిరంతర ప్రజా సేవలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు : జేపీ నడ్డా
ABN , First Publish Date - 2021-05-16T19:55:01+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు నిరంతర ప్రజా సేవలో
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు నిరంతర ప్రజా సేవలో నిమగ్నమయ్యారని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం చెప్పారు. ప్రజలకు సహాయపడేందుకు గడచిన 10 రోజుల్లో 1,200 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాస్మాను దానం చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించారని చెప్పారు. ప్రజలకు సహాయపడేందుకు 3,200 హెల్ప్లైన్లను జిల్లా, సబ్ డివిజినల్ స్థాయుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన ‘సేవా హీ సంఘటన్’ కార్యక్రమంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్కు సహాయాన్ని తీసుకెళ్తున్నవాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం నేపథ్యంలో ‘సేవా హీ సంఘటన్’ రెండో భాగాన్ని ప్రారంభించామని చెప్పారు. చాలా మంది బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రులతో కలిసి నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు. టెస్టింగ్ కోసం అవసరమైన సహాయాన్ని సాధ్యమైనంత వరకు అందజేస్తున్నామని తెలిపారు. ఆసుప్రతులు, పరీక్షలు, వ్యాక్సినేషన్ సంబంధిత సహాయాన్ని ప్రజలు పొందుతున్నారని తెలిపారు.
కోవిడ్పై పోరాటానికి ప్రభుత్వంతోపాటు సమాజం కూడా కలిసి వస్తున్న దేశం భారత దేశం ఒకటేనని చెప్పారు. ఈ వైరస్పై పోరాటానికి, ప్రజలకు సహాయపడటానికి లక్షలాది ఎన్జీవోలు తమ స్థాయిలో ఉత్తమంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహిళా మండళ్లు, స్వయం సహాయక బృందాలు కష్ట కాలంలో మాస్క్లు, పీపీఈ కిట్లను తయారు చేసి, పంపిణీ చేస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.