అమెరికా తెలుగు దిగ్గజం తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో జొన్నవిత్తుల 'ఉత్తరాంధ్ర శతకం' ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-04-26T13:16:49+05:30 IST

తెలుగు తల్లికి జరిగిన పదపుష్ప పాదార్చనలతో విశాఖనగరం పులకించింది. ఉత్తరాంధ్ర శతకాన్ని అందుకుని సముద్రుడు సంతోషించాడు.

అమెరికా తెలుగు దిగ్గజం తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో జొన్నవిత్తుల 'ఉత్తరాంధ్ర శతకం' ఆవిష్కరణ

• విశాఖ వేదికగా జరిగిన కార్యక్రమంలో భాగంగా సముద్రునికి శతకం అంకితం

• తెలుగు తల్లికి పదపుష్ప పాదార్చనలతో పులకించిన విశాఖ నగరం

• ఈ కార్యక్రమం ద్వారా శతక జైత్రయాత్రకు శ్రీకారం చుట్టిన తెలుగు భాషాభిమానులు

విశాఖపట్నం: తెలుగు తల్లికి జరిగిన పదపుష్ప పాదార్చనలతో విశాఖనగరం పులకించింది. ఉత్తరాంధ్ర శతకాన్ని అందుకుని సముద్రుడు సంతోషించాడు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన ఉత్తరాంధ్ర శతక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలో కన్నులపండువగా జరిగింది. తానా పూర్వాధ్యక్షులు, తానా విశ్వ సాహితీవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ ఈ కార్యక్రమానికి సారధ్యం వహించారు.


'తెలుగువేదకవి' జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన పది శతకాలు ప్రచురణ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సభలు చేయాలని అమెరికాలోని తెలుగు భాషాభిమానులు పూనుకున్నారు. 24వ తేదీ ఉదయం ఉత్తరాంధ్రలో భాగమైన విశాఖ సముద్ర తీరంలో ఉత్తరాంధ్రకు, తెలుగు తల్లికి, సముద్రునికి జేజేలు పలుకుతూ తెలుగు భాషాభిమానులు జొన్నవిత్తుల స్వదస్తూరితో రాసిన 108 పద్యాల రాతప్రతిని సముద్రునికి సమర్పించారు. అనంతరం సాగరతీరంలో చిన్నారులు అక్షర మాలను రాసి, పూలతో పూజించి, తెలుగు పద్యాలను, పాటలను ఆలపించారు. సాయంత్రం కళాభారతి వేదికగా జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర శతకాన్ని ఆవిష్కరించారు. జొన్నవిత్తుల ఇందులోని కొన్ని పద్యాలను గానం చేసి శ్రోతలను ఆనంద పరవశుల్ని చేశారు.


తోటకూర ప్రసాద్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో ఏయూ విశ్రాంత ఆచార్యులు వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత డా. కలశపూడి శ్రీనివాసరావు, విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత సూరపనేని విజయకుమార్, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, తెలుగు దండు వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి, తెలుగు భాషావేత్తలు, భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు. సభాపోషకులుగా తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లు సంస్థ.. ప్రేక్షకులందరికీ తియ్యతియ్యగా మిఠాయి పొట్లాలు అందజేశారు.



Updated Date - 2022-04-26T13:16:49+05:30 IST