జోలె పట్టి సర్పంచ్ భిక్షాటన
ABN , First Publish Date - 2022-06-03T08:38:20+05:30 IST
అక్కన్నపేట, జూన్ 2: అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులకు.. పుస్తెల తాడు అమ్మి వడ్డీ కట్టానని నల్లగొండ జిల్లా ఎరుగండ్లపల్లి సర్పంచ్ శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేసిన
రూ. 8 లక్షల పెండింగ్ బిల్లుల మంజూరు కోసం నిరసన
నిధులివ్వకుంటే ఆత్మహత్యే దిక్కని ఆవేదన.. ‘పల్లెప్రగతి’లో ఘటన
అక్కన్నపేట, జూన్ 2: అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులకు.. పుస్తెల తాడు అమ్మి వడ్డీ కట్టానని నల్లగొండ జిల్లా ఎరుగండ్లపల్లి సర్పంచ్ శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేసిన విషయం మరువకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశనాయక్ తండా గ్రామ సర్పంచ్ బానోతు రవీందర్ పెండింగ్ బిల్లుల మంజూరు కోసం జోలె పట్టి భిక్షాటన చేశారు. అక్కన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి సమీక్ష సమావేశంలో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లు నిర్మించామని, ఇందుకు సంబంధించి రూ. 8 లక్షల బిల్లులు రావాల్సి ఉన్నదని రవీందర్ చెబుతున్నారు. ఈ బిల్లులు మంజూరు కోసం ఎంపీడీవో, ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్లను ఆయన జోలె పట్టి అభ్యర్థించాడు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని రవీందర్ వాపోయారు. అందినకాడికి అప్పులు తెచ్చి.. ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్ బిల్లులకు నిధుల మంజూరు చెయ్యండి మహోప్రభో అని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. బిల్లుల కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన సర్పంచ్లు ఇటీవల నిరసనలకు దిగుతున్నారు. ఐదో విడత పల్లె ప్రగతి సమీక్ష సమావేశాల్లో ఎక్కడికక్కడ తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. కాగా, సర్పంచ్లంతా డబ్బులివ్వండి మహోప్రభో అని వేడుకుంటుంటే.. పల్లె ప్రగతి పనులకు సంబంధించిన ప్రతీ పైసా చెల్లించేశామని ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం.