తెల్ల కార్డుదారులందరికీ రేషన్‌ అందించాలి: జేసీ

ABN , First Publish Date - 2020-03-30T10:30:37+05:30 IST

జిల్లాలో తెల్ల కార్డులు ఉన్న ప్రతి వినియోగదారునికి రేషన్‌ సరకులు వేగంగా అందించాలని సంయుక్త కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అధికారులను ఆదేశించారు.

తెల్ల కార్డుదారులందరికీ రేషన్‌ అందించాలి: జేసీ

విశాఖపట్నం, మార్చి 29(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తెల్ల కార్డులు ఉన్న ప్రతి వినియోగదారునికి రేషన్‌ సరకులు వేగంగా అందించాలని సంయుక్త కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అధికారులను ఆదేశించారు. రేషన్‌ దుకాణాల పరిధిలో చేస్తున్న సరకుల పంపిణీ విషయమై ఆయన పౌరసరఫరాలశాఖ అధికారులు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అన్ని చౌక దుకాణాల వద్ద నిత్యావసర సరకులు లభ్యంగా ఉండాలని సూచించారు. ఆదివారం చేపట్టిన పంపిణీ కార్యక్రమంలో సాంకేతిక సమస్య ఎదురైన 75 మిషన్లు వెంటనే వెర్షన్‌ అప్‌డేట్‌ చేయాలని సూచించారు. సమస్యలు ఏవైనా ఉంటే ఉదయం 7 గంటల్లోపు స్వయంగా తనకు తెలియజేయాలని సూచించారు. మండల స్థాయిలో స్పందన లాగిన్‌లో కోవిడ్‌-19 ఖాతాలో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా లక్షన్నర కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్మలాబాయి, శివప్రసాద్‌, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ వెంకటరమణ ఇతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:30:37+05:30 IST