అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌కు అధిక ప్రాధాన్యత: జో బైడెన్

ABN , First Publish Date - 2020-07-02T21:56:04+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే సహజ భాగస్వామి అయిన భారత్‌తో

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌కు అధిక ప్రాధాన్యత: జో బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే సహజ భాగస్వామి అయిన భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని అధ్యక్ష బరిలో నిలిచిన జో బైడెన్ అన్నారు. బుధవారం జరిగిన వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశ భద్రత.. అదే విధంగా భారతదేశ భద్రత కోసం భారత్ అమెరికాతో భాగస్వామి కావాలి. భద్రతకు సంబంధించి ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో అవసరం’ అని జో బైడెన్ అన్నారు. ఒబామా ప్రభుత్వంలో తాను ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే అమెరికా - భారత్ సివిల్ న్యూక్లియర్ ఒప్పందానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపడం గర్వంగా ఉందన్నారు. ఒబామా హయాంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి అధిక ప్రాధాన్యమిచ్చామని.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా అదే విధంగా అధిక ప్రాధాన్యతను ఇస్తానన్నారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్ష బరిలో నిలవగా.. డెమొక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ తలపడుతున్నారు. ఇప్పటికే ట్రంప్ కంటే జో బైడెన్ ముందంజలో ఉన్నారని పలు సర్వేలు వెల్లడించాయి. మరోపక్క జో బైడెన్ కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ ర్యాలీలకే ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా ఆయన తన డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా ఇండియన్ అమెరికన్ అయిన మేధా రాజ్‌ను నియమించారు.

Updated Date - 2020-07-02T21:56:04+05:30 IST