కరోనా మరణాలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు !

ABN , First Publish Date - 2021-01-23T20:02:10+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనావైరస్ ప్రభావంపై అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా మరణాలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు !

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనావైరస్ ప్రభావంపై అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వల్ల దేశంలో ఆరు లక్షలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. కనుక కరోనాపై పోరులో భాగంగా తాను ప్రతిపాదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని యూఎస్ కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా ఆమోదిస్తే మహమ్మారి వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికన్లను ఆదుకోగలమని పేర్కొన్నారు. కరోనా ప్రభావం, ఆర్థిక సంక్షోభంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన బైడెన్.. 'చాలా వరకు దేశం బాధలో ఉంది. రోజురోజుకూ వైరస్ ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా మందిని మహమ్మారి పొట్టబెట్టుకుంది. నా అంచనా ప్రకారం 6 లక్షలకు పైగా మంది అమెరికన్లు దీనికి బలి కావొచ్చు. ఫిబ్రవరి వరకు మరణాల సంఖ్య 5 లక్షలకు చేరనుంది.' అని తెలిపారు. 


ఇక మహమ్మారిపై పోరులో భాగంగా శుక్రవారం బైడెన్ చాలా తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్ల కోసం రెండు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార సహాయాన్ని విస్తరించడంతో పాటు ఉద్దీపన తనిఖీలు చేపట్టడం ఒకటైతే, రెండోది ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌కు కనీస వేతనం 15 డాలర్లకు పెంచడం. వైరస్ వల్ల దేశవ్యాప్తంగా తీవ్రంగా బాధింపబడ్డ అమెరికన్ల కోసం ఈ రెండు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్న బైడెన్.. ఇది మిలియన్ల మంది అమెరికన్లకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే కరోనాపై పోరు మొదలెట్టిన అధ్యక్షుడు.. అమెరికాకు వచ్చే ప్రయాణికులకు క్వారెంటైన్‌, మాస్కు తప్పనిసరి చేశారు. ఇప్పటికే అగ్రరాజ్యం వెళ్లే ప్రయాణికులకు కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్‌ తప్పనిసరి అనేది తెలిసిందే.     

Updated Date - 2021-01-23T20:02:10+05:30 IST