దేవుడి కంటే ఆ కంపెనీయే ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది.. అమెరికా అధ్యక్షుడి గుస్సా..

ABN , First Publish Date - 2022-06-13T00:19:20+05:30 IST

దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో అమెరికన్లు అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్టు.. ప్రస్తుతం ఇంధన ధరలు కూడా వారికి చుక్కలు చూపించడం మొదలెట్టాయి.

దేవుడి కంటే ఆ కంపెనీయే ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది.. అమెరికా అధ్యక్షుడి గుస్సా..

ఎన్నారై డెస్క్: దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో అమెరికన్లు అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్టు.. ప్రస్తుతం ఇంధన ధరలు కూడా వారికి చుక్కలు చూపించడం మొదలెట్టాయి. అమెరికా చరిత్రలోనే  తొలిసారిగా శనివారం దేశంలో ఒక గ్యాలన్ పెట్రోల్(సుమారు 3.785 లీటర్లు) సగటు ధర 5 డాలర్లను దాటింది. ఇక ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా చట్టసభలకు మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనుండటంతో..ఇంధన ధరలు అంశం రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంధన ధరల కట్టడికి చేయవలసిందంతా చేస్తున్నారు. కానీ..  ధరలు దిగొచ్చేలా ఉత్పత్తి పెంచని అమెరికా చమురు కంపెనీలపైన ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రముఖ ఇంధన సంస్థ ఎక్సాన్‌మొబిల్‌‌‌ను టార్గెట్ చేస్తూ తాజాగా బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి కంటే ఎక్సాన్ సంస్థే ఎక్కువ డబ్బు ఆర్జిస్తోందంటూ మండిపడ్డారు.  ‘‘చమురు కోసం తవ్వకాలు చేపట్టేందుకు ఆయిల్ కంపెనీల వద్ద 9 వేల పర్మిట్లు ఉన్నాయి. కానీ.. వారు డ్రిల్లింగ్ చేయట్లేదు. చమురు ఉత్పత్తి తగ్గించి లాభాలు దండుకోవాలనే ఇలా చేస్తున్నాయి...’’ అంటూ విరుచుకుపడ్డారు.


అమెరికాలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు ప్రస్తుతం ఇంధన కంపెనీలపై కనకవర్షం కురిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో చమురు సరఫరా తగ్గి.. ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఓ అంచనా ప్రకారం..ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఎక్సాన్‌మొబిల్ సంస్థ భారీగా లాభాలు ఆర్జించింది. మరోవైపు.. ఇంధన ధరల కట్టడి కోసం బైడెన్ ఇప్పటికే  వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి కొంత మొత్తాన్ని విడుదల చేసినా ప్రజలు కోరుతున్న స్థాయిలో ఉపశమనం లభించట్లేదు.

Updated Date - 2022-06-13T00:19:20+05:30 IST