మరో కీలక పదవికి భారతీయుడ్ని ఎంపిక చేసిన బైడెన్
ABN , First Publish Date - 2021-01-19T14:33:02+05:30 IST
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ తన పాలకవర్గంలో ఇప్పటికే 20 మంది భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ తన పాలకవర్గంలో ఇప్పటికే 20 మంది భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయుడిని కీలక పదవికి ఎంపిక చేశారు. భారతీయ అమెరికన్ రోహిత్ చోప్రాను కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో(సీఎఫ్పీబీ) చీఫ్గా నియమించారు. కాథ్లీన్ లౌరా క్రానింగర్ స్థానంలో రోహిత్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కమిషనర్గా ఉన్నారు. 2018లో సెనేట్ ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషం. ఈ పదవిలో ఆయన చట్ట ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలను అదుపు చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంతకుముందు ఆయన సీఎఫ్పీబీ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. తాజాగా కీలక పరిపాలన స్థానాలకు పలువురిని నియమించిన బైడెన్.. రోహిత్కు సీఎఫ్పీబీ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు.