సిక్కుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న జో బైడెన్!

ABN , First Publish Date - 2020-09-28T23:24:48+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

సిక్కుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న జో బైడెన్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా ఐదు వారాల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పోరులో ఉన్న రెండు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో నిలిచిన జో బైడెన్ అమెరికాలోని మైనారిటీ వర్గాలపై ఫోకస్ పెట్టారు. సిక్కు అమెరికన్ల రక్షణ కోసం ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ‘జో బైడెన్ కోసం సిక్కు అమెరికన్లు’ అనే కార్యక్రమాన్ని సైతం బైడెన్ క్యాంపెయిన్ తాజాగా ప్రారంభించింది. అమెరికాలో సిక్కులు ఏ విధంగా వివక్ష, జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారో ఈ కార్యక్రమం ద్వారా జో బైడెన్ హైలైట్ చేయనున్నట్టు క్యాంపెయిన్ వెల్లడించింది. 2017 నుంచి చూస్తే అమెరికాలో ఎక్కువగా సిక్కులపైనే దాడులు జరిగాయని జో బైడెన్ క్యాంపెయిన్ చెప్పింది. 


అమెరికాలోని స్కూళ్లలో సిక్కు అమెరికన్లపై దాడులు జరగకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్టు జో బైడెన్ క్యాంపెయిన్ పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ సిక్కులపై చూపుతున్న వివక్షను ఆపకపోగా మరింత ప్రోత్సహించారంటూ మానవ హక్కుల కార్యకర్త, సిక్ అమెరికన్ నేషనల్ లీడర్‌షిప్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కౌర్ గిల్ ఆరోపించారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే సిక్కు అమెరికన్లు అటు స్కూళ్లలోనూ, ఇటు వీధుల్లోనూ సురక్షితంగా ఉండగలరని కిరణ్ కౌర్ అన్నారు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో వివక్ష, ద్వేషం, బెదిరింపులకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే.. అటు రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో మరోమారు నిలిచిన ట్రంప్ సైతం మైనారిటీ వర్గాలను ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2020-09-28T23:24:48+05:30 IST