Wisconsin gurdwara attack: విస్కాన్సిన్ గురుద్వారా విషాద ఘటనకు పదేళ్లు.. జో బైడెన్ విచారం
ABN , First Publish Date - 2022-08-07T19:08:16+05:30 IST
పదేళ్ల క్రితం విస్కాన్సిన్లో సిక్కు గురుద్వారాపై జరిగిన దాడి ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: పదేళ్ల క్రితం విస్కాన్సిన్లో సిక్కు గురుద్వారాపై జరిగిన దాడి ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు. ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు గురుద్వారాలో ఓ శ్వేతజాతీయుడు ఉన్మాదిలా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డార. శుక్రవారం ఈ జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతికి చెందిన బాధితులకు అధ్యక్షుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. 'శ్వేతజాతి దురహంకారం', 'దేశీయ ఉగ్రవాదం' సహా అన్ని రూపాల్లో ఉన్న ద్వేషాన్ని అంతం చేయడానికి, అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతిని, ఆయుధాల వాడకాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. దురదృష్టవశాత్తూ గడిచిన దశాబ్ధ కాలంగా దేశంలోని ప్రార్థనా మందిరాలపై దాడులు సర్వసాధారణమయ్యాయని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక యూఎస్లో జాతి, వర్ణ వివక్షలతో కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. ఆయుధాల వాడకంపై ఆంక్షలు లేకపోవడంతో సాధారణ ప్రజలపై విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా అమెరికాలో గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండడం శోచనీయం. ఈ విష సంస్కృతికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికి ఫలితం లేకుండా పోతోంది. శక్తివంతమైన గన్ మాఫీయా ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.