బడా కంపెనీలకు Biden సర్కార్ డెడ్‌ లైన్.. జనవరి 4లోపు ఆ పని చేయకుంటే రూ.10లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2021-11-05T21:14:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని బడా కంపెనీలకు జో బైడెన్ ప్రభుత్వం కరోనా టీకా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

బడా కంపెనీలకు Biden సర్కార్ డెడ్‌ లైన్.. జనవరి 4లోపు ఆ పని చేయకుంటే రూ.10లక్షల జరిమానా!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని బడా కంపెనీలకు జో బైడెన్ ప్రభుత్వం కరోనా టీకా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జనవరి 4 కంటే ముందే వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోవాలని డెడ్ లైన్ విధించింది. అలాగే వారానికోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని ఆదేశించింది. గురువారం నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. డెడ్ లైన్ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయని పక్షంలో కంపెనీలకు 14వేల డాలర్లు(రూ.10.41లక్షలు) జరిమానా విధిస్తామని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. 100 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో పని చేస్తున్న సుమారు 100 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి ఉందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అందుకే రెండు నెలల వ్యవధి ఇచ్చినట్లు తెలిపారు. అటు ఆస్పత్రులు, నర్సింగ్​హోమ్స్​, ఇతర మెడికల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 17 మిలియన్ల మంది​ సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. కానీ, వారు వీక్లీ ఒకసారి కరోనా టెస్టు చేయించుకోకపోయిన టీకా తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సంస్థలు, కార్మిక యూనియన్​లతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు బైడెన్​ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, ఈ నిబంధనలను అధ్యక్షుడు బైడెన్​ మొదటగా సెప్టెంబర్​లో సమీక్షించారు. అప్పుడు కంపెనీలు తమకు కొంత సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. దాంతో రెండు నెలల తర్వాత ఇప్పుడు ఈ రూల్స్‌ను తప్పనిసరి చేస్తూ బైడెన్ పరిపాలన విభాగం ఆదేశాలు జారీ చేసింది.   


Updated Date - 2021-11-05T21:14:44+05:30 IST