జాబ్‌ క్యాలెండర్‌ పచ్చి దగా

ABN , First Publish Date - 2022-06-18T08:27:45+05:30 IST

జాబ్‌ క్యాలెండర్‌ పచ్చి దగా

జాబ్‌ క్యాలెండర్‌ పచ్చి దగా

నోటిఫికేషన్లు లేవు.. భర్తీ లేదు

10,143 పోస్టులు భర్తీచేస్తామని ఏడాది కిందట ప్రకటన

నెలవారీగా ఏయే నోటిఫికేషన్లు ఇస్తామని ఆర్భాటంగా వెల్లడి

ఇచ్చినవే తక్కువ పోస్టులు.. అయినా భర్తీ చేయని వైనం

గ్రూప్‌-1, 2, పోలీస్‌, విద్య, ఇతర శాఖల్లో రాని నోటిఫికేషన్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఉద్యోగాల విప్లవం’ అంటూ సరిగ్గా ఏడాది కిందట వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ పచ్చి మోసమని నిరుద్యోగులు చెబుతున్నారు. ‘‘లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటినీ భర్తీచేసేస్తాం. అంతేకాదు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ రూపొందించి.. దాని ప్రకారం చెప్పిన సమయంలో నోటిఫికేషన్లు ఇస్తాం. నిర్ణీత సమయంలో పోస్టుల భర్తీ కూడా పూర్తిచేస్తాం’’ అని ఎన్నికలకు ముందు అప్పటి విపక్ష నేతగా ప్రస్తుత సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చాక లక్షల పోస్ట్లులు వేలల్లోకి వచ్చేశాయి. అవసరం ఉన్నప్పటికీ వందల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేయలేదు. అంతేకాదు.. భర్తీచేస్తామని ప్రకటించిన కొద్ది పోస్టుల ఊసు కూడా ఎత్తడం లేదు. 2021-22లో 10,143 పోస్టులను భర్తీ చేస్తామని.. ఏడాదిక్రితం ప్రకటించారు. సరిగ్గా గత ఏడాది జూన్‌ 18న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా ఈ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఏ నెల ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌ వస్తుందో కూడా ప్రకటించారు. అన్ని నోటిఫికేషన్ల కింద ఇచ్చే ఉద్యోగాలను ఒక ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు. దీనిపై గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ‘ఉద్యోగాల విప్లవం’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఊసు లేకుండా పోయింది.  


విప్లవం కాదు.. వైఫల్యం

ఏడాది కిందట ప్రకటించిన 2021-22 జాబ్‌ క్యాలండర్‌లో భర్తీ చేస్తామని ప్రకటించిన పోస్టుల సంఖ్య 10,143. వీటిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2పోస్టులు 36గా పేర్కొన్నారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 36 పోస్టులతోనే క్యాలెండర్‌ ప్రకటిస్తారా? అని నిరుద్యోగులంతా భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. నిరుద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో ప్రభుత్వం ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. సుమారు 292 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 182పోస్టులు.. మొత్తం కలిపి 292 పోస్టులు చూపించింది. వాస్తవానికి ఇది కూడా పెద్ద సంఖ్యేమీ కాదు. అయినప్పటికీ జరిగిందేంటి? ఏం చేశారు? అనేది పరిశీలిస్తే.. అసలు ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ కూడా రాలేదు. ఈ తేదీ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. కనీసం ఆ పోస్టుల భర్తీకి అవసరమైన ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. 


పోలీసుల పరిస్థితీ ఇంతే!

పోలీసు శాఖలో 450 పోస్టులు భర్తీ చేస్తామని జాబ్‌ క్యాలండర్‌లో ప్రకటించారు. అందులోను ఒక్క పోస్టునూ భర్తీచేయలేదు. విద్యాశాఖలో డిగ్రీ కళాశాల లెక్చరర్లు 240, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 2000 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటి భర్తీకి కనీసం నోటిఫికేషన్‌ కూడా రాలేదు. అదేవిధంగా ఇతర పోస్టులు 36 భర్తీ చేస్తామని ప్రకటించారు. వాటి సంగతీ అలానే ఉంది. వైద్యశాఖలో పారామెడికల్‌, ఫార్మాసి్‌స్టలు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ఇవి ఎక్కడికక్కడ రెగ్యులర్‌ అవసరాల ప్రాతిపదికన భర్తీచేసేవి. పైగా, కొవిడ్‌ కాలంలో అవసరం ఉండడంతో వీటిని మాత్రం భర్తీచేశారు. అన్నీ చూస్తే ఉద్యోగాల విప్లవం అని ప్రకటించిన ప్రభుత్వం.. కనీసం కొన్ని పోస్టులనూ భర్తీ చేయడంలో విఫలమైందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. 


పోస్టుల కోత.. భర్తీ మరింత కోత

పోస్టుల ప్రకటన విషయంలోనే ప్రభుత్వం గతానికి ఇప్పటికీ భారీ కోత పెట్టింది. గతంలో చెప్పిన మాటలకు-ఇప్పుడు ప్రకటిస్తున్న పోస్టులకు అసలు పొంతనే లేదు. గతంలో ఎన్నికల ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తాం అన్నారు. ఈ అతిపెద్ద హామీని అలవోకగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులు నమ్మారు. కానీ, ఈ రోజు ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి వాటిని భర్తీ చేశామని చెప్తున్నారే తప్ప.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పక్కన పెట్టేశారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏటా 6,500 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ, గత రెండేళ్లలో ఏ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. మరోవైపు డీఎస్సీ వేసి ఉపాధ్యాయ పోస్టులను భారీగా భర్తీచేస్తామని.. మెగా డీఎస్సీ వేస్తామని ఎన్నికల ముందు ఊదర గొట్టారు. కానీ, మూడేళ్లవుతున్నా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.  

Updated Date - 2022-06-18T08:27:45+05:30 IST