Jammu and Kashmir కానిస్టేబుల్ను కాల్చిచంపిన ఉగ్రవాదులు..24 గంటల్లో రెండో ఘటన
ABN , First Publish Date - 2022-05-13T20:10:11+05:30 IST
పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ఒకరిని ఉగ్రవాదులు..
శ్రీనగర్: పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ఒకరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం అతనిని ఇంటి వద్దే కాల్చిచంపారు. దీంతో గత 24 గంటల్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వారి సంఖ్య రెండుకు చేరింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ను రెయాజ్ అహ్మద్ థోకెర్గా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెయాజ్ కన్నుమూసినట్టు కశ్మీర్ జన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
దీనికి ముందు, గురువారం సాయంత్రం బుద్గాం జిల్లా ఛదూరలోని తహసిల్ కార్యాలయంలో పనిచేస్తున్న కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ను ఆఫీసు ఆవరణలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో ఆగ్రహోదగ్రులైన స్థానికులు శ్రీనగర్-బుద్గాం హైవేను దిగ్బంధించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయి గోళాలు ప్రయోగించారు. ఈ ఘటన సిగ్గుచేటంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించగా, కశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొందనే భారత ప్రభుత్వ వాదన తప్పనే విషయం రుజువైందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. బాధిత కశ్మీర్ పండిట్ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్న ఆమెను అధికారులు శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు.