జీవో 22ను తక్షణమే రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-08-18T05:37:32+05:30 IST
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ జీవో 22ను తక్షణమే రద్దు చేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల ధర్నా
కలెక్టరేట్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ జీవో 22ను తక్షణమే రద్దు చేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విద్యుత్ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత ఏడాది రైతు ఉద్యమ విరమణ సందర్భంగా విద్యుత్ చట్టం బిల్లుపై రైతు సంఘాలతో చర్చిస్తామని, బిల్లులో వ్యవసాయనికి మినహాయింపు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీకి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. రైతు సంఘాలతో చర్చించకుండా, వ్యవసాయానికి మినహాయిపుంపు లేకుండా యాథాతథంగా పార్లమెంట్ ముందు బిల్లు పెట్టిందని విమర్శించారు. దీనిపై అన్ని రాజీకీయ పార్టీలు, రైతు సంఘాలు తీవ్రంగా నిరసనలు తెలపడంతో పార్లమెంటరీ స్టాండ్ కమిటీకి పంపిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ సవరణ బిల్లు చట్టమైతే.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు మొత్తం కార్పొరేట్ కంపెనీలుగా, ప్రైవేట్ ఏజెన్సీల పరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అన్ని రంగాలకు విద్యుత్ షాక్ ఏర్పడుతుందన్నారు. అనంతరం విద్యుత్ శాఖ ఈఈకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కె.మోహనరావు, జి.ఈశ్వరరావు, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.