ఐస్క్రీంతో నైస్గా.. సిబ్బందిని ఫూల్స్ని చేసిన జిల్ బైడెన్!
ABN , First Publish Date - 2021-04-02T21:46:14+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, అగ్రరాజ్య ప్రథమ మహిళ జిల్ బైడెన్.. తన సిబ్బందికి, సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు షాకిచ్చారు. ఏప్రిల్ 1(ఫూల్స్ డే) సందర్భంగా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, అగ్రరాజ్య ప్రథమ మహిళ జిల్ బైడెన్.. తన సిబ్బందికి, సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు షాకిచ్చారు. ఏప్రిల్ 1(ఫూల్స్ డే) సందర్భంగా మారు వేషంతో అందరినీ ఒకేసారి ఫూల్స్ను చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్ బైడెన్ కాలిఫోర్నియాలో పర్యటనను ముగించుకుని తన సిబ్బందితో సహా గురువారం వాషింగ్టన్కు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా జిల్ బైడెన్.. విగ్ ధరించి తన రూపాన్ని మార్చుకున్నారు. జాస్మిన్ అనే పేరుతో విమానంలోని సిబ్బందికి, సీక్రెట్ సర్వీస్ అధికారులకు, మీడియా ప్రతినిధులకు ఐస్క్రీం అందించారు.
వారంతా ఐస్క్రీం తిన్న తర్వాత.. అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రెస్ సెక్షన్లోకి వెళ్లి విగ్ను తీసేసి, ఐస్క్రీంను సర్వ్ చేసింది తానేనంటూ ప్రకటించారు. అంతేకాకుండా తన చేతిలో అందరూ ఫూల్స్ అయ్యారంటూ ఆటపట్టించారు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన సిబ్బంది, మీడియా ప్రతినిధులు.. తర్వాత దాని నుంచి తేరుకుని నవ్వుకున్నారు. అయితే జిల్ బైడెన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా జిల్ బైడెన్ సిబ్బందిని ఆటపట్టించారు. ఎయిర్ ఫోర్స్ 2లో ప్రయాణిస్తూ.. లగేజ్ను కంపార్ట్మెంట్లో దాక్కున్నారు. అనంతరం ఆ కంపార్ట్మెంట్ను మొదటగా తెరిచిన సిబ్బందిని ‘భూ..!’ అంటూ హడలెత్తించారు.