తీపి కబురు!
ABN , First Publish Date - 2021-10-19T04:34:08+05:30 IST
జీగిరాం జూట్ కార్మికులకు తీపి కబురు. మిల్లు తెరిచేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బుధవారం నుంచి మిల్లును తెరిచేందుకు కొత్త యాజమాన్యం అంగీకరించినట్టు తెలిసింది.
జీగిరాం జూట్ మిల్లు లాకౌట్ ఎత్తివేత?
రేపటి నుంచి ఉత్పత్తి ప్రారంభం
(సాలూరు రూరల్)
జీగిరాం జూట్ కార్మికులకు తీపి కబురు. మిల్లు తెరిచేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బుధవారం నుంచి మిల్లును తెరిచేందుకు కొత్త యాజమాన్యం అంగీకరించినట్టు తెలిసింది. గత ఏడాది డిసెంబరు 1న యాజమాన్యం ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. దీంతో దాదాపు రెండు వేల మంది కార్మికులు వీధినపడ్డారు. పది నెలలు దాటినా లాకౌట్ ఎత్తకపోవడంతో కార్మిక కుటుంబాల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్య ప్రతినిధి సప్తగిరి నెల్లిమర్ల జూట్ మిల్లు అధికారికి పరిశ్రమను అప్పగించేందుకు నిర్ణయించారు. సాలూరు మునిసిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వరరావు ఆధ్వర్యంలో 13 మంది కార్మిక సంఘాల ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరిగాయి. కొన్ని కీలకాంశాలను కార్మికులు యాజమాన్యం ముందు ఉంచారు. గత ఏడాది నవంబరులో పనిచేసిన ఐదు రోజులకు వేతనం చెల్లించడానికి, ఫిబ్రవరికి సంబంధించి పెండింగ్ డీఏ ఇవ్వడానికి, ఆగస్టు డీఏను ఆరు నెలల అనంతరం ఇవ్వడానికి అంగీకరించారు. పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు, గ్రాట్యూటీని అందించేందుకు కొత్త, పాత యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో మిల్లును నిర్వహణ నిమిత్తం లాకౌట్ ఎత్తివేసినట్టు ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలిసింది.