కృప కురిసేది వారి మీదే!

ABN , First Publish Date - 2020-02-14T06:05:01+05:30 IST

గలిలయలో పట్టణంలో సీమోను అనే పరిసయుడు యేసు ప్రభువును తన ఇంటికి భోజనానికి రమ్మని అహ్వానించాడు. ఏసు ప్రభువు రాక గురించి తెలిసిన ఎందరో సామాన్యులు అక్కడకు చేరుకున్నారు.

కృప కురిసేది వారి మీదే!

గలిలయలో పట్టణంలో సీమోను అనే పరిసయుడు యేసు ప్రభువును తన ఇంటికి భోజనానికి రమ్మని అహ్వానించాడు. ఏసు ప్రభువు రాక గురించి తెలిసిన ఎందరో సామాన్యులు అక్కడకు చేరుకున్నారు. వారిలో ‘పాపాత్మురాలు’గా ముద్రపడిన ఒక మహిళ కూడా ఉంది. ఆమె ఏసు ప్రభువు ముందు కూలబడి, తన కన్నీటితో ఆయన పాదాలను తడిపింది. ఆయన కాళ్ళను తన కేశాలతో తుడిచింది. ఆయన పాదాలను ముద్దుపెట్టుకుంది. సుగంధభరితమైన నూనెతో ఆ పాదాలకు అభిషేకం చేసింది. 


యేసు ప్రభువును ఆహ్వానించిన సీమోనుకు చిరాకు కలిగింది. ‘ఆమె పాపాత్మురాలు. ఈయనే కనుక నిజమైన ప్రవక్త అయితే, తనను స్పృశించినది ఎవరో, ఆమె ఎటువంటి మహిళో ఆయనకు తెలిసి ఉండాలి కదా!’ అని తనలో తాను అనుకున్నాడు.

ఇది గమనించిన యేసు ప్రభువు‘‘ సీమోనూ, నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను’’ అన్నాడు.

‘‘బోధకుడా! చెప్పండి’’ అన్నాడు సీమోను. 

‘‘ఒక ధనవంతుడి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఒకరు తీసుకున్నది అయిదు వందల దీనారాలు. రెండో వ్యక్తి తీసుకున్నది యాభై దీనారాలు. వారిద్దరిలో ఎవరూ అప్పు తీర్చలేకపోయారు. ఇద్దరి అప్పులనూ ఆ ధనవంతుడు మాఫీ చేశాడు. ఆ రుణదాతను వారిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టపడతారు?’’ అని ప్రశ్నించాడు.‘‘బహుశా అయిదు వందల దీనారాల ను మాఫీ పొందిన వ్యక్తేనని అనుకుంటున్నా!’’ అని చెప్పాడు సీమోను.


‘‘నీ తీర్పు సరైనదే! నువ్వు నన్ను నీ ఇంటికి ఆహ్వానించావు. కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇవ్వడం, స్వాగతపూర్వకంగా ముద్దు పెట్టుకోవడం, తలకు నూనె రాయడం సాంప్రదాయం. అవేవీ నువ్వు చెయ్యలేదు. కానీ ఆమె కన్నీళ్ళతో నా పాదాలను తడిపింది. తన కేశాలతో వాటిని తుడిచింది. ముద్దు పెట్టుకుంది. నా పాదాలను సుగంధ తైలంతో అభిషేకించింది. నిజమే! ఆమె చాలా పాపాలు చేసింది. కానీ అందుకు ఆమె పశ్చాత్తాపం చెందుతోంది. కాబట్టి అవన్నీ క్షమాపణకు నోచుకున్నాయి. ఎక్కువ పాపాల నుంచి క్షమకు నోచుకున్నందుకు ఆమె ఎక్కువ ప్రేమను చూపిస్తోంది. తక్కువ పాపాల నుంచి క్షమ పొందినవారి ప్రేమ తక్కువగా ఉంటుంది. అది సహజమే కదా! అన్నాడు ఏసు ప్రభువు. తరువాత ఆ మహిళను చూసి ‘‘నీ పాపాలు క్షమకు నోచుకున్నాయి. నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. వెళ్ళు! వెళ్ళి ప్రశాంతంగా 

జీవించు!’’ అని ఆశీర్వదించాడు. 


మనుషుల యోగ్యతల గురించి దైవం కన్నా తెలిసినవారు మరెవరూ ఉండరు. ఎవరి విశ్వాసం నిష్కల్కషమైనదో ఆయనకు తెలుసు. తన కృపను అటువంటి విశ్వాసులపైనే ఆయన వర్షిస్తాడు.

Updated Date - 2020-02-14T06:05:01+05:30 IST