నష్టాల సాకుతో ప్రైవేటీకరణ దారుణం!
ABN , First Publish Date - 2022-01-25T05:27:55+05:30 IST
నష్టాల సాకుతో నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం జెన్కో ఇంజనీర్లు, ఉద్యోగులు నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు
నల్లబాడ్జీలతో జెన్కో ఉద్యోగుల నిరసన
ముత్తుకూరు, జనవరి 24 : నష్టాల సాకుతో నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం జెన్కో ఇంజనీర్లు, ఉద్యోగులు నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని జెన్కో థర్మల్ కేంద్రం ఎదుట ఉద్యోగులు, కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ నష్టాలు వాటిల్లుతాయన్న పేరుతో థర్మల్ కేంద్రం నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. థర్మల్ కేంద్రం కోసం భూములు వదులుకున్న స్థానికుల త్యాగం నిరర్థకమవుతుందన్నారు. ప్రైవేటు రంగానికి అప్పగిస్తే కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది అన్యాయమైపోతారన్నారు. ఇంజనీర్లు, ఉద్యోగుల నిరసనకు నేలటూరు సర్పంచు భక్తాని కనకయ్య, వివిధ కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.