జీతాలపై పట్టు
ABN , First Publish Date - 2022-01-29T06:31:23+05:30 IST
కొత్త పీఆర్సీ అమలు చేయడాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న ప్రభుత్వం, సవరించిన జీతాలనే బట్వాడా చేయాలని పట్టుదలగా ఉంది. పంతం నెగ్గించుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులపై పలురకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది.
కొత్తవే ఇవ్వాలంటున్న ప్రభుత్వం
బిల్లుల అప్లోడ్కు పలురకాలుగా ఒత్తిళ్లు
రంగంలోకి జిల్లా కలెక్టర్లు
అన్ని శాఖల అధికారులకు లేఖలు
జీతాల బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశాలు
ససేమిరా అంటున్న ఉద్యోగులు
పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి డిమాండ్
కలెక్టర్, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్కు వినతిపత్రాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కొత్త పీఆర్సీ అమలు చేయడాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న ప్రభుత్వం, సవరించిన జీతాలనే బట్వాడా చేయాలని పట్టుదలగా ఉంది. పంతం నెగ్గించుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులపై పలురకాలుగా ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి రోజూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఖజానా శాఖ డైరెక్టర్...జిల్లాల్లో ఖజానా అధికారులతో టెలి, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎంతమంది ఉద్యోగుల బిల్లులు అప్లోడ్ చేశారో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అవసరమైతే డీడీవోలతో మాట్లాడాలని ఆదేశాలు జారీచేశారు. ఖజానా సిబ్బంది ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో జీతాల బిల్లులు అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే కొత్త వేతన సవరణ మేరకు జీతాలు తీసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ‘రివర్స్ పీఆర్సీ మాకొద్దు...పాత జీతాలు తీసుకుంటాం’’ అని ప్రభుత్వానికి తేల్చిచెప్పేశారు.
కాగా వారం రోజుల నుంచి ఎన్ని రకాలుగా బెదిరించినా ఉద్యోగ, ఉపాధ్యాయులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను రంగంలోకి దింపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీతాల బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని రెండు, మూడు రోజుల క్రితం జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ లేఖలు పంపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుక్రవారం జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఉద్యోగుల జీతాల బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
పోలీస్ జీతాల బిల్లుల మాత్రమే అప్లోడ్
కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు చేసినా...జిల్లాలో పోలీసులు తప్ప మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయులు జనవరి నెల జీతాల బిల్లులు అప్లోడ్ చేయలేదు. జిల్లాలో అన్ని శాఖల్లో సుమారు 35 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతాలు బిల్లుల తయారీ, ఇత్యాది వ్యవహారాలు చూసేందుకు సుమారు రెండు వేల మంది డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్)లు ఉన్నారు. వీరిలో 15 మంది డీడీవోలు కేవలం నాలుగు వేల మంది పోలీసుల జీతాల బిల్లులను అప్లోడ్ చేశారు. మిగిలిన డీడీవోలు ఇంకా బిల్లులు అప్లోడ్ చేయలేదు. మరో 15 వేల మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, పది వేల మంది గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతాలు కూడా డీడీవోలు డ్రా చేయాల్సి ఉంది.
ఉద్యోగి అనుమతితోనే జీతాల బిల్లులు అప్లోడ్
సాధారణంగా ప్రతి నెల 25వ తేదీ నుంచి జీతాల బిల్లుల అప్లోడ్ ప్రక్రియ ప్రారంభమై నెలాఖరులోగా ముగుస్తుంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు అప్లోడ్ చేయాలంటే ప్రతి ఉద్యోగి నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే కొత్త పీఆర్సీని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో కొత్త జీతాలతో బిల్లులు అప్లోడ్ చేయడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ప్రభుత్వం పలు రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చింది. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయులు మెట్టు దిగలేదు. అధికారుల సమాచారం మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల అనుమతి లేకుండా కొత్త జీతాలు అప్లోడ్ చేయడం సాధ్యం కాదని స్పష్టమైంది.
పాత జీతాలే ఇవ్వాలని వినతిపత్రాలు
ఇదిలావుండగా జనవరి నెలకు సంబంధించి పాత జీతాలే ఇవ్వాలని జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు...కలెక్టర్ నుంచి ఉప ఖజానా అఽధికారుల వరకు వినతిపత్రాలు అందచేస్తున్నారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు ఈశ్వరరావు, నాగేశ్వరరెడ్డి, ఎస్వీ రమణ, వినయ్మోహన్, జవహర్ తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ మల్లికార్జునను కలిశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఐదు డీఏలతో కలిపి పాత జీతాలే ఇప్పించాలని కోరారు. జిల్లాలో ఉద్యోగుల హక్కులను కాపాడే బాధ్యత కలెక్టర్దేనని పేర్కొంటూ కొత్త జీతాల విషయంలో తమపై ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు 24వ తేదీ నుంచి ఆందోళనలో వున్నందున పాత జీతాలే ఇప్పించేలా ట్రెజరీ అఽధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ శివరామ్ప్రసాద్ను కలిసి పాత జీతాలతో బిల్లులు అప్లోడ్ చేయాలని కోరారు.