ఎన్ఈపీతో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం
ABN , First Publish Date - 2022-01-22T03:35:34+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20-20తో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఎంతో ప్రయోజనమని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) మువ్వా రామలింగం పేర్కొన్నారు.
విద్యాశాఖ జేడీ (సర్వీసెస్) మువ్వా రామలింగం
కావలిటౌన్, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20-20తో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఎంతో ప్రయోజనమని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) మువ్వా రామలింగం పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శాంతినగర్లో ఓ ప్రైవేట్ పాఠశాల సమావేశ మందిరంలో ఎన్ఈపీ-20-20పై డివిజన్ పరిధిలోని హెచ్ఎంలు, ఎంఈవోలకు వర్క్షాపు నిర్వహించారు. డిప్యూటీ ఈవో రాజాబాలాజీరావు అధ్యక్షతన జరిగిన వర్క్షాపులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎన్ఈపీలో భాగంగా 3 కిలోమీటర్లు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3,4,5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసి ఉన్నత పాఠశాలలోని సబ్జెక్ట్ టీచర్లచే బోధన అందిస్తారన్నారు. 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేకపోతే అక్కడే యధాతథంగా తరగతులు కొనసాగుతాయన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఏ ఉన్నత పాఠశాలలోనైనా ఏదైనా ఒకే మీడియం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనంపై కీలక నిర్ణయం తీసుకుందన్నారు. మెరుగైన విద్యకోసం విద్యాప్రమాణాల పెంపు కోసం విలీనం తప్పదని విద్యాశాఖ రూపొందించే కార్యచరణకనుణంగా హెచ్ఎంలు, ఎంఈవోలు నడుచుకోవాలని సూచించారు. బాలికల, బాలుర పాఠశాలలు ఇకపై విడివిడిగా ఉండవని, కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రమేష్, తదితరులు పాల్గొన్నారు.