కడప జిల్లా జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి తరలింపు
ABN , First Publish Date - 2020-08-08T03:57:22+05:30 IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని
అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్పై టీడీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట జేసీకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుత్తి మేజిస్ట్రేట్ ముందు ఆయన్ను పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు. దీంతో కడప జిల్లా సబ్ జైలుకు తరలించారు.
కాగా.. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్పై కడప జైలు నుంచి గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ మళ్లీ ఆయన్ను కడప జైలుకు తరలించారు.
కాగా.. జేసీ ప్రభాకర్రెడ్డిపై శుక్రవారం నాడు అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఏకంగా ప్రభాకర్రెడ్డిపై సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, అనంతరం కడప జైలుకు తరలించారు.