రేషన్ బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్టు
ABN , First Publish Date - 2021-10-23T05:52:47+05:30 IST
పదేపదే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే వ్యక్తులపై పీడీ యాక్టుని ప్రయోగించబోతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు.
జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్
గుంటూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పదేపదే రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే వ్యక్తులపై పీడీ యాక్టుని ప్రయోగించబోతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని డీఆర్సీ మీటింగ్ హాల్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు తొమ్మిది మిల్లుల్లో తనిఖీలు, దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పీడీఎస్ బియ్యం రీ ప్యాకింగ్, రీ పాలిషింగ్, అక్రమ రవాణాని గుర్తించడం జరిగిందన్నారు. వారిపై 6ఏతో పాటు సెక్షన్-7 కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసులు నమోదు చేశామన్నారు. ఇకపై అక్రమంగా రేషన్ బియ్యాన్ని దారి మళ్లించే వారిపై కఠినచర్యలు చేపట్టబోతున్నట్లు హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పాల్గొంటున్న వాహనాల రిజిసే్ట్రషన్ని రద్దు చేస్తామన్నారు. అలానే డ్రైవర్ల లైసెన్సులు కూడా తొలగించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ పాల్గొన్నారు.