సునామి మాక్డ్రిల్ని పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-04T06:39:23+05:30 IST
సునామి వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జిల్లాయంత్రాంగం వెంటనే స్పందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు వేగవంతంగా తరలించేందుకు సునామి మాక్డ్రిల్ని పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) దినేష్కుమార్
గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సునామి వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జిల్లాయంత్రాంగం వెంటనే స్పందించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు వేగవంతంగా తరలించేందుకు సునామి మాక్డ్రిల్ని పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రవిపత్తుల నిర్వహణశాఖ ఆదేశాలతో నిర్వహించనున్న సునామి మాక్ డ్రిల్ నిర్వహణ ప్రణాళికపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సునామి మాక్డ్రిల్ని నిజాంపట్నంలోని నక్షత్రనగర్లో నిర్వహించనున్నామన్నారు. దీనికి సంబంధించి ఆపరేషన్, ప్లానింగ్, లాజిస్టిక్ బృందాలను ఏర్పాటుచేసి విపత్తుల నిర్వహణ ఎస్వోపీ ప్రకారం సంబంధిత శాఖల అధికారులను నియమించాలన్నారు. మాక్డ్రిల్పై తదుపరి సమావేశం నాటికి శాఖలవారీగా నిర్వహించాల్సిన విధులపై ఎన్డీఆర్ఎఫ్, జిల్లా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను సమన్వయం చేసుకొని పూర్తి నివేదికని రూపొందించాలన్నారు. సమావేశంలో తెనాలి సబ్కలెక్టర్ మయూర్ అశోక్, జడ్పీ సీఈవో చైతన్య, ప్రకృతి విపత్తుల నిర్వహణ జిల్లా మేనేజర్ మనోరమ, డీటీసీ మీరా ప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ నథానియేల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఇరిగేషన్ ఎస్ఈ బాబురావు, డీఆర్డీఏ పీడీ ఆనంద్నాయక్, డీఎస్వో పద్మశ్రీ పాల్గొన్నారు.