NTR Satha Jayanthi : ఒకే ఒక్కడు NTR.. భాగ్యనగరంతో విడదీయలేని అనుబంధం.. ఆసక్తికర విషయాలివిగో..

ABN , First Publish Date - 2022-05-28T13:42:54+05:30 IST

NTR Satha Jayanthi : ఒకే ఒక్కడు NTR.. భాగ్యనగరంతో విడదీయలేని అనుబంధం.. ఆసక్తికర విషయాలివిగో..

NTR Satha Jayanthi : ఒకే ఒక్కడు NTR.. భాగ్యనగరంతో విడదీయలేని అనుబంధం.. ఆసక్తికర విషయాలివిగో..

నందమూరి తారక రామారావు.. (NTR) వెండితెర చరిత్రలో  అజరామరమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల గుండెల్లో విరాజిల్లే ఆరాధ్య మూర్తి. రాజకీయాల్లో (Politics) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన చైతన్య దీప్తి. ఆ మహనీయుడి రాజకీయ ప్రభంజనానికి హైదరాబాద్‌ వేదికైంది. ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు ప్రారంభం. ఆ మహనీయుడికి నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది.


హైదరాబాద్‌ సిటీ : ట్యాంక్‌బండ్‌ (TankBund) మీద కొలువుదీరిన 33 మంది తెలుగు సాహిత్య, సాంస్కృతిక, వైతాళికుల విగ్రహాలు చూడగానే వీక్షకులకు ఎన్టీఆర్‌ గుర్తొస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా (Chief Minister) ఉన్న సమయంలో ప్రత్యేక శ్రద్ధతో ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తపాలాశాఖలోని అధికారి సైదులుని సమాచార శాఖ కమిషనర్‌గా నియమించి మరీ అతనికి విగ్రహాల నిర్మాణ బాధ్యతలను అప్పగించినట్లు సీనియర్‌ జర్నలిస్టు బండారు శ్రీనివాసరావు చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ మధ్య బుద్ధుని విగ్రహాన్ని ఎన్టీఆర్‌ హయాంలోనే ఏర్పాటు చేశారు.


చివరి వరకు..

నిమ్మకూరులో పుట్టి, గుంటూరులో చదివి, మద్రాసులో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి తొలి అడుగులు పడింది హైదరాబాద్‌లోనే (Hyderabad City). గండిపేట నుంచి ఆబిడ్స్‌ రామకృష్ణ స్టూడియోకి రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు కారులో వెళుతున్న ఎన్టీఆర్‌ను చూసేందుకు రోడ్డు వెంట అభిమానులు బారులుదీరేవారని ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి నాగభైరవ కోటేశ్వరరావు ‘ఎన్టీఆర్‌తో నా అనుభవాలు’ పుస్తకంలో రాశారు. ఎన్టీఆర్‌ తుదిశ్వాస విడిచిందీ ఇక్కడే. నెక్లెస్‌ రోడ్డులో ఆయన సమాధి మాత్రమే కాదు, ఆయన స్మారకంగా పార్కు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అలా ఒకటా, రెండా...హైదరాబాద్‌ చరిత్ర పుటలో విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మృతులెన్నో.


పార్టీ పుట్టిందీ ఇక్కడే..

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌ చరిత్ర (NTR History) ఉంది. 1982 మార్చి 29 న ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం గోల్కొండ చౌరస్తాలోని రామకృష్ణ సినీ స్టూడియో నుంచి జన చైతన్యయాత్రకు ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు. తొమ్మిది నెలలు యాత్ర తర్వాత 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఘన విజయం సాధించారు. 1983 జనవరి 9న ఎల్బీ స్టేడియంలో తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసం టూరిస్టు కేంద్రంగా మారింది.ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు ప్రారంభం సందర్భంగా సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లుచేసినట్లు నగర అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా తెలిపారు. 


నేడు లఘుచిత్ర మాలిక ఆవిష్కరణ

కాగా శనివారం ‘మహోన్నతుడు ఎన్టీఆర్‌’ లఘు చిత్ర మాలిక శనివారం ఆవిష్కరించనున్నట్లు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ సమితి (ఆంధ్ర-తెలంగాణ) కన్వీనర్‌ దగ్గుబాటి పురంధరేశ్వరి (Daggubati Purandareswari) తెలిపారు.


ప్రగతినగర్‌లో  కాంస్య విగ్రహ ఏర్పాట్లు

నిజాంపేట్‌ కార్పొరేషన్‌ ప్రగతినగర్‌ చౌరస్తాలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహ ఏర్పాట్లుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొలన్‌ లీడర్‌ నర్సింహరెడ్డి, ప్రగతినగర్‌కు చెందిన బొప్పన రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ ఈ విగ్రహ తయారీకి రూ. 11 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘం సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్‌, ఎన్టీఆర్‌పై ప్రేమ, అభిమానం ఉన్న పలువురు నేతలు కలిసికట్టుగా విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల ప్రారంభానికి రానున్న సుమారు 15 వేల నుంచి 20 వేల మందికి భోజన సదుపాయం కూడా చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద్‌, ఆరెకపూడి గాంధీ, మేయర్‌ నీలా రెడ్డి, టీడీపీ నాయకులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నిజాంపేట్‌ గ్రామ చౌరస్తాలో లీడర్‌ నర్సింహరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.


చైతన్య రథమెక్కి..

ఎన్జీఆర్‌ రాజకీయ జీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందిన చైతన్య రథం నేడు నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో విశ్రాంతి తీసుకుంటోంది. 1982లో ఎన్జీఆర్‌ పార్టీని స్థాపించిన కొద్ది రోజుల్లోనే ప్రచారానికి వాహనం అవసరం రావడంతో చావర్‌లే కంపెనీకి చెందిన ఆ వాహనాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రాంచంద్రన్‌ నుంచి నాడు ఎన్జీఆర్‌ కొనుగోలు చేశారట. ప్రచారానికి అనువుగా ఉండేందుకు సకలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైతన్య రథం అని పేరుపెట్టారు. అందులో కూర్చునేందుకు ఎత్తైన సీటు, సమావేశం అయ్యేందుకు పొడవైన సోఫా, టాయిలెట్‌, వాహనం లోపలి నుంచే పైకి ఎక్కేందుకు మెట్లు ఉంటాయి. ఆ చైతన్య రథానికి రథ సారథిగా నందమూరి హరికృష్ణ వ్యవహరించగా మీసాల రెడ్డి అనే డ్రైవర్‌ కూడా ఉండే వాడు. మీసాల రెడ్డి విశ్రాంతి తీసుకునేటప్పుడు హరికృష్ణ ఆ వాహనాన్ని నడిపేవారు.

Updated Date - 2022-05-28T13:42:54+05:30 IST