రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారింది: జవహర్
ABN , First Publish Date - 2021-10-19T15:51:40+05:30 IST
ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యేనని మాజీ మంత్రి జవహర్ అన్నారు.
అమరావతి: దళిత నేత ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యేనని, బెదిరింపులతో దళిత నాయకత్వాన్ని కట్టడి చేయలేరని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వారసులుగా అక్రమాలను దౌర్జన్యాలను ఎండగడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోపణలు చేసిన వారిని ఆధారాలు అడగడం పోలీస్ వ్యవస్థ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. పోలీసులు, దొంగలు ఒక్కటయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్నారు. పాలకులే అక్రమార్జనకు కేరాప్ అడ్రస్గా మారారని విమర్శించారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని, ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి అని టైపు చేస్తే ఏపీ కనపడుతుందన్నారు. సార రహిత జిల్లాలను నాటు సారా జిల్లాలుగా మార్చారని, ఏపీని మాదక ద్రవ్య రాజధాని చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా వేధింపులు ఆపకపోతే జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని జవహర్ అన్నారు.